త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మదేవుడు. తల రాతను రాసె ఆ బ్రహ్మ దేవుడికి తప్ప మిగతా అందరి దేవుళ్ళకి ఆలయాలు అనేవి ఉన్నాయి. అయితే ఒక శాపం కారణంగా బ్రహ్మకి ఆలయాలు అనేవి లేవని పురాణాలూ చెబుతున్నాయి. ఇది ఇలా ఉంటె ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పురాతన అరుదైన బ్రహ్మ శిల్పం అనేది బయటపడింది. మరి ఆ శిల్పం ఎలా ఉంది? అసలు బ్రహ్మ దేవుడికి ఎందుకు ఆలయాలు అనేవి ఉండవు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, పెదకొండురు దగ్గరలో శ్రీ ఆనందేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ఆవరణలో బ్రహ్మ యొక్క అరుదైన ఒక శిల్పం ఇటీవలే బయపడింది. ఈ విగ్రహాన్ని చూసిన స్థానికులు పురావస్తు అధికారులకి తెలుపగా వారు పరిశీలించి కొన్ని వివరాలను తెలియచేసారు. ఆ శిల్పం 12 వ శతాబ్దానికి చెందినది గా వారు గుర్తించారు. ఇక ఆ శిల్పం ఎరుపు రంగు రాయి పైన చెక్కబడి ఉంది. బ్రహ్మ సుఖాసనంలో కూర్చొని ఉండి నాలుగు ముఖాలు కలిగి నాలుగు చేతులతో దర్శనం ఇస్తున్నారు. ఈ శిల్పం అతిపురాతనమైన చాలా అరుదైన బ్రహ్మ దేవుడి శిల్పం అని వారు తెలియచేసారు.
ఇది ఇలా ఉంటె బ్రహ్మానికి మాత్రమే ఎందుకు ఆలయాలు ఉండవు, బ్రహ్మకి పూజలు ఎందుకు జరుగవు అనే విషయంలోకి వెళితే, పూర్వం లోకకళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగుమహర్షిని పంపినప్పుడు, అలా బయలు దేరిన భృగుమహర్షి తొలుత సత్యలోకాన్ని చేరుకుంటాడు . ఆ సమయంలో వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు, ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీ దేవి సంగీతంలో సంలీనులై ఉంటారు. భృగుమహర్షి రాకను గమనించకుండా వారి ధ్యానంలో ఉండిపోతారు. దాంతో కోపోద్రేక్తుడైన భృగుమహర్షి కలియుగంలో భూమి మీద నీకు పూజలు ఉండవని శాపమిచ్చి వెళ్ళిపోతాడు. అందువలనే బ్రహ్మకు భూలోకంలో దేవాలయాలు ఉండవని, పూజలు కూడా జరగవని చెపుతారు.
బ్రహ్మ దేవుడు పూజలు అందుకునే ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామం నందు కోనేటిలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం కలదు. పురాణాల ప్రకారం పూజలకు బ్రహ్మకు అర్హతలేదు కనుక పరోక్షంగా ఈశ్వరునికి అభిషేకం చేసి అది బ్రహ్మకు చెందేలా రూపొందించబడటం ఈ ఆలయం ప్రత్యేకత. అయితే బ్రహ్మదేవుడు కమలగర్భుడు కనుక ఒక కమలంలో ఓ సృష్టికర్త నాలుగు ముఖాలు ఉండి పైన శివలింగాకృతి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ మూర్తిని కోనేరులో ప్రతిష్టించారు.
రాజస్థాన్ లో అజ్మీర్ కు వాయువ్య భాగం లో సుమారు 10 కిలో మీటర్ల దూరం లో పుష్కర్ దగ్గర గాయత్రి గిరి లో ఉన్న శక్తి పీఠం ఇది. దీనినే బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు. అమ్మవారి కంఠా భరణం ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం. ఇక్కడి అమ్మవారు గాయత్రీదేవి. నిత్యంహోమాలు, పూజలతో కళకళ లాడుతుంది. ఈ సరస్సు ఒడ్డునే బ్రహ్మ దేవుని ఆలయం ఉంది.
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, ధర్మపురి లో ఉన్న నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మ దేవుడి విగ్రహం అనేది ఉంది.