వినాయకుడు విగ్నాలను నివారించే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. మన హిందూ సంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి వినాయకుడు. ఆయన్ని గణేశుడు, గణపతి, గణనాయకుడు, ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు. ఆ గణపతిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ప్రతి పూజలోను ఆయనే మొదటగా పూజలందుకుంటాడు. ఇది ఇలా ఉంటె ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలో వినాయకుడు మూడు తొండాలు కలిగి, నెమలివాహనుడై దర్శనమిస్తున్నాడు. మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో దాగి ఉన్న మరిన్ని విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూణే లోని సోమ్వార్లేన్లో త్రిశుండ్ మయూరేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, సాధారణంగా వినాయకుడు ఒక తల, ఒక తొండం, నాలుగు చేతులతో దర్శనమిస్తుంటాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం మూడు తొండాలు, ఆరు చేతులతో దర్శనమిస్తుంటాడు. అంతేకాకుండా వినాయకుడి వాహనం ఎలుక కానీ ఈ ఆలయంలో నెమలి వాహనుడై వినాయకుడు భక్తులకి దర్శనమివ్వడం మరొక విశేషం. ఇక్కడ వినాయకుడు మూడు తొండాలతో దర్శనమిస్తుంటాడు కావున త్రిశుండ్ అనే పేరు వచ్చినది. ఇంకా గర్భగుడిలో ఉన్న వినాయకుడు విగ్రహం నిలువెల్లా సింధూరంతో ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు.
ఇక ఈ ఆలయ నిర్మాణం పూర్తవ్వడానికి మూడు సంవత్సరాల సమయం పట్టిందట. భీమ్జిగిరి గోసవి అనే ఒక స్థానిక భక్తుడు 1754 లో ఈ ఆలయాన్ని కట్టించాడట. అయితే 1754 లో ఆలయ నిర్మాణం మొదలవ్వగా 1770 లో ఆలయ గర్భగుడిలో మూడు తొండాలు కలిగిన వినాయకుడిని ప్రతిష్టించారట. ఇక్కడి గర్భగుడిలోని వినాయకుడి విగ్రహం ఏకశిలనిర్మాణం. ఈ ఆలయ నిర్మాణానికి కేవలం పెద్ద పెద్ద నల్లని రాళ్లను మాత్రమే ఉపయోగించారట. ఇంకా గర్భగుడిలోని రాళ్ళపైన మూడు శాసనాలు ఉండగా, అందులో రెండు శాసనాలు దేవనాగరి లిపి, మరొకటి పర్షియన్ భాషలో చెక్కబడి ఉన్నాయి. పర్షియన్ భాషలో ఉన్న శాసనం దేవాలయ చరిత్ర తెలియచేస్తుండగా, దేవనాగరి లిపిలో ఉండే రెండు శాసనాలలో ఒకదానిమీద రామేశ్వర ఆలయ స్థాపన, రెండవది సంస్కృత శాసనంలో భగవద్గీతశ్లోకాలను చెక్కారు.
ఈ విధంగా మూడు తొండాలు, ఆరు చేతులతో, నెమలివాహనుడై దర్శనమిస్తున్న వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.