కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి గురించి తెలియని తెలుగు వారుండరు. మనకు నచ్చిన వస్తువులు వదిలేసి ఏం కోరిన తీర్చే విజ్ఞ వినాయకుడు శ్రీ వరసిద్ధి వినాయకుడు. అక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు చెబుతారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విగ్రహాలు పెరుగుతాయని భక్తులు విశ్వాసం. కాణిపాకం లో లాగే కేరళలోని మధుర్ గ్రామం శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు.
కేరళ బోర్డర్ లోని కసార్గాడ్ పట్నానికి అతి సమీపంలో మధుర్ మహాగణపతి అనే ఆలయం. ఈ ఆలయ ఆవిర్భావం, చరిత్ర అన్నీ విశేషమే. నిజానికి ఈ ఆలయంలోని మూలవిరాట్టు శివుడు స్వయంభు అని చెబుతారు. పూర్వం మధుర అనే ఒక స్త్రీ ఈ శివలింగాన్ని కనుగొందట. ఆ తరువాత శివలింగం చుట్టూనే ఈ ఆలయాన్ని నిర్మించారు. మధుర కనుగొన్నది కాబట్టి, ఈ ఆలయానికి ‘మధుర్ మహాగణపతి ఆలయం’ అన్న పేరు వచ్చింది. విగ్రహాన్ని తొలిసారి చూసింది మహిళ కనుక ప్రస్తుతం తొలి దర్శనాన్ని ప్రత్యేకించి మహిళకే కల్పిస్తున్నారు.
ఆలయ స్థల పురాణం ప్రకారం ఒసారి ఆలయపూజారి పిల్లవాడు ఈ శివాలయానికి వచ్చాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ… గర్భగుడిలోకి చేరుకున్నాడు. అక్కడ దక్షిణం వైపు ఉన్న గోడ మీద ఒక వినాయకుని రూపుని సరదాగా చెక్కాడు. పిల్లవాడి భక్తికే మెచ్చాడో, తండ్రి చెంత తను కూడా ఉండాలనుకున్నాడో కానీ… ఆ బొమ్మ నుంచి ఓ వినాయకుని రూపు ఆవిర్భవించడం మొదలైంది. అంతేకాదు… అలా మొదలైని రూపు నానాటికీ పెరుగుతోందట.
ఆ ఆలయం చరిత్రలో మరో విశేషం కూడా ఉంది. ఒకసారి టిప్పు సుల్తాను తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ దిశగా వచ్చాడట. తిరుగు ప్రయాణంలో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడట. కానీ ఈ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోయిందని చెబుతారు. అయితే తన సైనికుల తృప్తి కోసం నామమాత్రంగా తన ఖడ్గంతో ఆలయం గోడ మీద ఒక వేటు వేసి వెళ్లిపోయాడట. ఇప్పటికీ ఆలయం గోడ మీద టిప్పు సుల్తాను తన ఖడ్గంతో వేసిన వేటు గుర్తుని చూడవచ్చు.
మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనిపిస్తుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని ‘గజప్రిస్త’ గోపురాలని అంటారు. ఆలయంలోని చెక్క మీద రామాయణ, మహాభారత ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు. ఆలయం ప్రక్కనే మధువాహిని అనే నది ప్రవహిస్తుంటుంది. వర్షాకాలంలో నదీనీరు ఆలయంలోకి ప్రవేశించడం విశేషం. ఏదైనా కొత్త పనిని ఆరంభించేటప్పుడు, అనుకున్న పనికి ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు….. మధుర్ మహాగణపతి ఆలయాన్ని దర్శిస్తే తప్పక ఫలితం దక్కుతుందన్నది అక్కడి భక్తుల నమ్మకం.