సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. ఈ దేవిని ఒక్క హిందువులు మాత్రమే కాకుండా జైనులు, బుద్దులు కూడా ఆరాధిస్తారు. కంబోడియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. మన దేశంలో సరస్వతీదేవిని పూజించే కొన్ని ఆలయాలు ఏంటి ఎక్కడ ఉన్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సరస్వతిదేవి ఆలయం – బాసర
తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, బాసరలో గోదావరి నది ఒడ్డున జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి విగ్రహాన్ని వ్యాసమహర్షి ప్రతిష్టించినట్లు ప్రతీతి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి ఇక్కడికి వచ్చి తపస్సు చేసాడని, ప్రతి రోజు ఉదయం గోదావరిలో స్నానం చేసి మూడు పిడికిళ్ల ఇసుక తెచ్చి మూడు కుప్పలుగా పోసి పుజించాడని, ఆ మూడు ఇసుక కుప్పలే సరస్వతి, లక్ష్మి, కాళికా రుపొందాయని పురాణం. ఈ ఆలయంలో పిల్లల అక్షరాబ్యాసం చేయించడానికి తల్లితండ్రులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
శ్రీ వైష్ణోదేవి ఆలయం – కాట్రా
జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రంలో కాట్రా అనే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. త్రికూట పర్వత గుహలో ఈ ఆలయం వెలసింది. మనదేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా చెప్పబడే వాటిలో వైష్ణోదేవి ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. పూర్వం జగన్మాత భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సు నుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవించారని స్థల పురాణం. ఇలా ఆదిశక్తి మూడు అంశలతో సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపం ధరించి వైష్ణోదేవిగా ఇక్కడ పిండరూపంలో ఆవిర్భవించింది.
ముక్తేశ్వరస్వామి ఆలయం – కాళేశ్వరం
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరంలో అతి ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే. ఒకే పానవట్టావం పైన పక్క పక్కనే రెండు శివలింగాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారం ముందు సరస్వతి మందిరం ఉంది.
శారదా పీఠం – శృంగేరి
కర్ణాటక రాష్ట్రం, తుంగభద్ర నది ఒడ్డున శృంగేరి వద్ద ఈ ఆలయం ఉంది. ఇక్కడ వెలసిన శారదాదేవి జ్ఞానికి, విజ్ఞాన సర్వస్వానికి తల్లి లాంటిది. ఆదిశంకరాచార్యుల వారు తానూ నిత్యం పూజానిమిత్తం తన ఇష్టదైవం అయినా శారదాదేవి మూర్తిని మంచి గంధపు చెక్కతో చేయించి ప్రతిష్టించుకున్నారు.
ఈవిధంగా కాశ్మీర్ లో బాల సరస్వతి, బాసర లో జ్ఞాన సరస్వతి, కాళేశ్వరంలో మహాసరస్వతి రూపంగా వెలసింది.