శుక్లమాసంలో భాద్రపద శుద్ధ చవితిని వినాయకుడి జన్మదినంగా వినాయకచవితిని ప్రతి ఒక్కరు చాలా ఘనంగా జరుపుకుంటారు. చవితి మొదలు తొమ్మిది రాత్రులను గణపతి నవరాత్రులు గా జరుపుకుంటారు. అయితే తొమ్మిది రోజులు వినాయక విగ్రహాన్ని పూజించిన భక్తులు నవరాత్రులు ముగిసిన తరువాత వినాయకుడిని బావిలో, చెరువులో లేదా నదులలో నిమజ్జనం అనేది చేస్తుంటారు. మరి వినాయకుడిని ఇలా నిమజ్జనం చేయడం వెనుక కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహాభారతం విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని కాపాడటం కోసం శ్రీకృష్ణుడి అవతారాన్ని ఎత్తగా పాండవులకు, కౌరవులకు మధ్య కురుక్షేత్ర మహా యుద్ధం జరుగగా ధర్మాన్ని కాపాడటం కోసం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ కృష్ణుడు పాండవుల తరుపున ఉంటూ యుద్ధంలో అర్జునుడి రథ సారధిగా ఉంటూ కౌరవులను నాశనం చేసాడు. ఇది ఇలా ఉంటె మహాభారతాన్ని రాసింది వేద వ్యాసుడు అని చెబుతారు. కానీ వాస్తవానికి వ్యాసుడు చెబుతుండగా వినాయకుడే తన దంతంతో మహాభారతాన్ని రాసాడని పురాణం.
వ్యాసుడు చెబుతుండగా వినాయకుడు రాసేందుకు ఒక షరతు కూడా ఉంది. అదేంటంటే విన్నది అర్ధం చేసుకున్న తరువాతే రాయాలి. ఆలా వినాయకుడు వ్యాసుడు చెబుతుండగా అందులో పూర్తిగా లీనమై అర్ధం చేసుకొని రాస్తుండగా వినాయకుడి శరీరం వేడి కుంపటిలాగా అయింది. ఇది గ్రహించిన వేద వ్యాసుడు వినాయకుడిని దగ్గరలో ఉన్న జలాశయంలో స్నానం చేసి రమ్మనగా అప్పుడు నీటిలో మునిగి స్నానం చేసి రాగానే వినాయకుడి శరీరం చల్లబడింది.
అదేవిధంగా నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు మరల వేడి చెందుతాడని వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం మొదలైందని పురాణం చెబుతుంది. అంతేకాకుండా నీరు అనేది గంగ మాత అని వినాయకుడికి గంగ తల్లితో సమానం కనుక తల్లి ఒడిలోకి చేరి హాయిగా ఉంటాడని మరికొందరి నమ్మకంగా చెబుతారు.
ఇక వినాయక నిమజ్జనం గురించి మన పెద్దలు చెబుతున్న కారణం ఏంటంటే, పూర్వం వినాయకచవితి సందర్బంగా ఏ గ్రామంలో నివసించే వారు ఆ గ్రామంలో ఉండే చెరువులోని మట్టిని తీసి ఆ మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేసి పూజించేవారు. ఇలా చెరువులో మట్టిని ఎందుకు తీస్తారంటే భాద్రపద మాసంలో వర్షాలు అనేవి తప్పనిసరిగా పడతాయి. అందుకే చెరువులలో ఉండే బంకమట్టి తీసి విగ్రహాన్ని చేయడం వలన చెరువులో పూడిక తీసినట్లుగా అవుతుంది. ఇలా తీసిన మట్టితో విగ్రహాన్ని చేయడం వలన అందులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అందుకే ప్రకృతి వైద్యం లో ఒండ్రు మట్టిని వాడుతుంటారు. ఇక మట్టితో చేసిన వినాయకుడిని తిరిగి మళ్ళీ అదే చెరువులో నిమజ్జనం చేయడం వలన ఈ కాలంలో సహజంగా కురిసే వానలకు నీటిలో చాలా మలినాలు, క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. మట్టి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వలన ఆ నీరు స్వచ్ఛముగా మారుతుందని చెబుతారు.
పంచ భౌతికమైన ప్రతి ఒక్క పదార్థం అంటే పంచ భూతాల నుండి జనించిన సజీవ, నిర్జీవ పదార్థము మధ్యలో ఎంతో వైభవంగా విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈవిధంగా ప్రకృతి దేవుడిగా కొలిచే వినాయకుడిని భక్తి శ్రద్దలతో పూజించి మట్టితో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడం అనేది చేస్తుంటారు.