మన హిందూసాంప్రదాయంలో ఎన్నో ఆచారాలనేవి ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో కూడా ఒక వింత ఆచారం అనేది ఉంది. ఇక్కడ సంతానం కోసం ఒక ముప్పై అడుగుల ఎత్తు ఉన్న స్తంబానికి చీరకట్టి ఒడిబియ్యం పొసే ఆచారం ఉంది. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు ఎవరు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకి 35 కి.మీ. దూరంలో బెజ్జంకి అనే గ్రామంలో ఒక కొండపైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని 12 వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో గణపతిదేవ చక్రవర్తి సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఇచట ఎత్తైన గోపురంలో విశాలమైన మండపంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.
ఈ ఆలయం నక్షత్రకారపు వేదికపై దక్షిణముఖముగా నిర్మించబడింది. ముఖమంటపమునకు మూడు వైపులా ద్వారమండపములు ఉన్నవి. ఆలయమునకు ఉత్తరమున సుమారు ముప్పై అడుగుల ఎత్తుగల స్థంభం ఉంది. దీనిని ఆండాళ్ళు స్థంభం అంటారు. సంతానం కోసం ఇప్పటికి ఈ స్థంబానికి చీరకట్టి ఒడిబియ్యం పొసే ఆచారం కొనసాగుతుంది.
ఆలయమనుకు పడమర వైపున కొంత దూరంలో ఇదే గుట్టపై ఉన్న గుండ్రాయి పై భైరవ విగ్రహం చతుర్భుజాలతో చెక్కబడి ఉంది. భైరవుని శిరముపై పాము పడుగలు గొడుగువలె ఉన్నవి. ఇంకా దేవాలయమునకు పడమటి వైపున గుట్టపైన కాస్త దిగువున స్వామివారి పుష్కరిణి ఉన్నది. భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేసి, స్వామివారిని కొలుస్తారు. ఇక ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.
ఈ స్వామివారి వద్ద భక్తులు మ్రొక్కులు మ్రొక్కుకున్న వారు దివిటీలు వెలిగించుట ఆలయ ప్రత్యేకతలలో ఒకటి. ఇచట నిత్యపూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక చైత్ర మాసంలో ఈ స్వామివారి జాతర జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారిని దర్శించుటకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.