మన దేశంలో ఎన్నో శివాలయాలు అనేవి ఉన్నాయి. అయితే శివుడు కొలువై ఉన్న ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, శివుడు లింగరూపంలో కాకుండా గోరూపంలో దర్శనమిచ్చిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇలా శివుడు దర్శనం ఇవ్వడం వెనుక ఒక పురాణం ఉంది. మరి శివుడు ఎందుకు గోరూపంలో దర్శమిచ్చాడు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్త్రం, పశ్చిమగోదావరి జిల్లా, గోదావరి నది తీరాన, రాజమండ్రికి 7 కి.మీ. దూరంలో కొవ్వూరు అనే గ్రామంలో నందు గోష్పాద క్షేత్రం అనే ప్రసిద్ధి చెందిన ఆలయం ఉంది. అయితే ఈ ప్రదేశంలో గౌతమ మహర్షికి శివుడు గోరూపంలో పాదమిడి దర్శనమిచ్చిన క్షేత్రం కనుక గోష్పాద క్షేత్రం అని ఆ మహర్షిని దీనిని స్తుతించాడు. అందుకే ఈ క్షేత్రం గోవూరుగా పిలువబడుతూ నేటికీ కొవ్వూరుగా స్థిరపడింది. ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం గౌతమమహర్షి తన భార్య అహల్యతో కలసి పరమేశ్వరుని ఆరాధించి అయన సంపూర్ణ అనుగ్రహాన్ని సంపాదించాడు. ఆవిధంగా గౌతమమహర్షి నిత్యం వేదోక్త కర్మాచరణ కావిస్తూ ధర్మప్రచారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంతలో ఆ ప్రాంతంలో ఎన్నడూ లేనివిధంగా కరువు కాటకాలు వచ్చాయి. ప్రజలు తిండి దొరకగా అల్లాడిపోతున్న సమయంలో గౌతమమహర్షి తన తపశ్శక్తితో ధాన్యం పండిస్తూ ప్రజలను పోషిస్తున్నాడు.
ఈ విధంగా 12 సంవత్సరాలు గడిచిన తరువాత గౌతమునికి పరీక్షాకాలం ఆసన్నమైనది. అప్పుడు వెంటనే శివుడు గోరూపం ధరించి తన పుత్రుడైన గణపతిని దూడగా చేసి గౌతముడు పండించే పొలంలో పంటను నాశనం చేస్తున్నారు. అప్పుడు అది చూసిన గౌతముడు వెంటనే పక్కన ఉన్న దర్బాలతో గోవుని అదలించాడు. అప్పుడు అది వెంటనే మరణించింది. ఆవిధంగా తనకి గోహత్య పాతకము సంక్రమించినందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. గోహత్య పాపపరిహారార్థం ఏదైనా చేయాలనీ ఆలోచిస్తుండగా, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోపాలస్వామి దర్శనం ఇచ్చి ఆ మహర్షిని ఓదార్చాడు. ఆవిధంగా అతని పాపపరిహారార్థం తానే విగ్రహరూపంలో భువిలో వెలసెదనన్నాడు. అందుకు మహర్షి చాలా సంతోషించాడు. పశ్చిమ గోదావరి తీరాన మరునాడే గౌతముడు వస్తుండగా గోపాలస్వామివారి విగ్రహం దర్శనమిచ్చింది. అప్పుడు ఆనందంతో గౌతముడు అహల్యతో కలసి ఆ గోపాలస్వామి వారిని ప్రతిష్ట చేసారు. అప్పుడు మరణించింది అనుకున్న గోవు లేచింది. అప్పుడు గౌతముడు సంతోషంతో వారికీ నమస్కరించాడు. శివగణపతులు దర్శనమిచ్చి అతడిని దీవించారు. ఆలా పరమశివుడే గోరూపాన్ని ధరించి పాదం మోపిన పుణ్యస్థలం కాబట్టి ఇది గోపురుగా ప్రసిద్ధి చెందింది. శివకేశవులు ఇద్దరు పాదాలుమోపి, ముక్తినొసంగు దివ్యక్షేత్రం ఈ గోష్పాద క్షేత్రం.