దేశంలో ప్రసిద్ధ దేవాలయాలలో మహారాష్ట్ర లోని షిరిడి ఒకటిగా చెబుతారు. సాయిబాబా అంటే మనిషి రూపం దాల్చిన ఒక దేవుడిగా ఆయనను భక్తులు నమ్ముతారు. ఈయన సాధువు కనుక హిందువులు శివుని అవతారంగా సాయిబాబాను కొలుస్తారు. అయితే సాయిబాబా సమాధి అనంతరం షిరిడి లో ఆయనకు ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇది ఇలా ఉంటె ఇక్కడ వెలసిన సాయిబాబా ఆలయం దక్షిణ షిరిడి గా కొలుస్తూ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో, జిల్లా కేంద్రమైన కర్నూలు పట్టణంలో తుంగభద్రా నదీ తీరమున శ్రీ షిరిడి సాయిబాబావారి ఆలయం కలదు. ఈ ఆలయంలో సాయిబాబా సాధుపురుషుడిగా గా ఆలయం నందు ఆరాధింపబడుచున్నాడు. ఈయన మానవ రూపంలో అవతరించి పూర్ణ పురుషులుగా భక్తులచే కొనియాడబడిన మహాత్ముడు.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. ఇది నక్షత్రం ఆకారంలో వుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ దేవి, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో సుమారు 800 మంది ప్రజల సామర్ధ్యం గల పెద్ద ధ్యాన మందిరంలో ధ్యానం చేయవచ్చు.
ఇది ఇలా ఉంటె సాయిబాబా ఎవరికీ జన్మించాడు ఎప్పుడు జన్మించాడనే విషయాలు ఇప్పటికి ఎవరికీ తెలీదు. కానీ కొన్ని కథల ప్రకారం ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లుగా చెబుతారు. అంతేకాకుండా ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు సాయిబాబా చెప్పాడని చెబుతారు. ఇంకా పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చారని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత షిరిడి కి తిరిగి వచ్చారనే కథనాలు ఉన్నాయి.
ఈవిధంగా దక్షిణ షిరిడి గా పేరుగాంచిన తుంగభద్రా నది తీరాన వెలసిన ఈ సాయిబాబా మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.