మదర్ తెరిస్సా గారు తనకి 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే నన్ గా మారి ఆ తరువాత భారతదేశానికి వచ్చి కలకత్తా నగరంలోని బీదవారిని చూసి చెలించి పోయి వారి కోసం పాటు పడుతూ అనాధలకు పెద్ద దిక్కుగా మారి నిస్వార్థ సేవలను అందిస్తూ అందరికి అమ్మలా నిలిచింది. మరి ఇంతటి నిస్వార్థ సేవలను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మదర్ తెరిస్సా గారి జీవితంలోని కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మదర్ తెరిస్సా 1910 ఆగస్టు 26 వ తేదీన నికోల్లె మరియు డ్రాన బొజాక్షిహ్యు దంపతులకి మాసిడోనియా లో జన్మించారు. మదర్ తెరిస్సా అసలు పేరు ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు. గొంక్శే అనే పదానికి అల్బేనియన్ భాషలో గులాబీ మొగ్గ అని అర్ధం. మదర్ తెరిస్సా 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి జబ్బుతో మరణించారు. అయితే తానూ పుట్టినది ఆగస్టు 26 వ తేదీ అయినప్పటికీ మతం స్వీకరించింది ఆగస్టు 27 వ తేదీ కావున ఆ రోజే తన అసలైన పుట్టిన రోజు గా భావించారు. ఆమె తండ్రి మరణించిన తరువాత తన తల్లి ఆమెను రోమన్ కథొలిక్ గా పెంచారు. అయితే తన చిన్న తనంలోనే మత ప్రచారకుల జీవిత కథల పట్ల, వారి సేవల పట్ల ఆకర్షించబడిన మదర్ తెరిస్సా 12 సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలనీ నిశ్చయించుకొని 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ అఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరారు.
మదర్ తెరిస్సా మొట్టమొదటగా 1929 లో, ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారత దేశంలో హిమాలయ పర్వతాల వద్ద నున్న డార్జిలింగ్ కి వచ్చారు. ఇక 1931 మే 24 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మతప్రతిజ్ఞ చేసారు. ఇక మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డి లిసే పేరు మీదుగా తన పేరును తెరెసాగా మార్చుకున్నారు. ఆ తరువాత 1937 మే 14 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నపుడు తన పవిత్రప్రతిజ్ఞ చేసారు.
అయితే కలకత్తా నగరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు ఆ నగరంలోని మురికి వాడ లో నివసించే బీదవారిని చూసి ఆమె మనస్సు చెలించి పోయి వారితోనే ఉంటూ వారికీ సేవ చేయాలనీ తలచి 1948 లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి మురికి వాడలలో ప్రవేశించారు. ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు. ఆలా పేద పిల్లలకి చదువు చెప్పారు,అనారొగ్యులకు సపర్యాల తొ పాటు వైద్యం కుడా చెసేవారు మథర్, దిక్కు మొక్కు లేని అనాధలకు పెద్ద దిక్కు అయ్యారు మథర్.
అలా 1950లొ మిషినరీస్ ఆఫ్ చారిటీ కోల్ కట లొ ప్రారంభించారు మథర్ తెరిస్సా. అయితే కుష్ఠు వ్యాధి గ్రస్తులు, ఎవరు లేని అనాథలు ఇలా అందరిని ఆదుకొని సేవలందించడమే వీరి ముఖ్యలక్ష్యం. ఇలా 1952 లొ 12 కేంద్రాల నుండి కరుణామృతమైన ప్రేమను పంచుతూ ప్రపంచ్వ్యాప్తంగా 450 కేంద్రాలకు పెరిగింది మిషినరీస్ ఆఫ్ చారిటీ. ఇలా విస్తరించిన ఈ సంస్థ అనాథ శరణాలయాలు, ఎయిడ్స్ ధర్మశాలలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ, శరణార్ధులకు, అంధులకు, అంగవికలురకు, వృద్ధులకు, మద్యపాన గ్రస్తులకు, బీదవారికి మరియు నిరాశ్రయులకు, వరద బాధితులకు, అంటువ్యాధులు మరియు కరువు బాధితులకు సహాయం చేస్తోంది.
ఇలా బీదవారికి సేవలను అందిస్తున్న మదర్ తెరిస్సా యొక్క తాత్త్వికత మరియు ఆచరణలు కొంత విమర్శకు గురిఅయ్యాయి. క్రిస్తోఫేర్ హిచెన్స్ మరియు జర్మన్ పత్రిక స్టెర్న్ మదర్ తెరిస్సా, విరాళాల ధన్నాన్ని పేదరికం తొలగించడానికి లేక ధర్మశాలలలోని పరిస్థితులను మెరగుపరచడానికి కాక కొత్త మఠాలను ఏర్పాటు చేయడానికి మతపరమైన కార్యక్రమాలను పెంచడానికి వెచ్చించారని అన్నారు. అంతేకాక విరాళాలు సేకరించిన వనరులు కూడా విమర్శించ బడ్డాయి.
మదర్ థెరీసా హైతిలోని నిరంకుశ మరియు అవినీతి పరులైన దువలిఎర్ కుటుంబం నుండి విరాళాలను అంగీకరించి వారిని బహిరంగంగా పొగిడారు. కీటింగ్ ఫైవ్ స్కాండల్ గా పేరుపొందిన కేసులో, మోసము మరియు అవినీతి ఆరోపణలతో నిందితుడిగా ఉన్న చార్లెస్ కీటింగ్ నుండి 1.4 మిలియన్ డాలర్ల విరాళాన్ని అంగీకరించి, అరెస్టుకు ముందు మరియు తరువాత కూడా అతనిని బలపరిచారని చెబుతారు.
ఇలా కొన్ని విమర్శలు ఉన్నపటికీ ఆవిడ ఎప్పుడూ ప్రత్యేక అకర్షణగా నిలవాలని అనుకోలేదు, ప్రాపంచిక సుఖాల గురించి ఆవిడ యేనాడు అలొచించలేదు ఎందుకంటె ఆవిడ ఎంచుకున్న మార్గం నిస్వార్ధమైన సెవా మార్గం. 1979 లొ నొబెల్ శాంతి బహుమతి పొందిన మథర్ తెరిస్సా, ఆ బహుమతి మొత్తం అయిన $6,000 ని కలకత్తా లొని మురికివాడలకు దానం ఇచ్చారు, ఈ మోత్తాన్ని ఉపయొగించి కొన్ని 100ల మంది ఆకలి తీర్చచ్చు అన్నారు మథర్.1994లొ అమెరికాలొ జరిగిన ఒక సదస్సు లొ అబొర్షన్ ని వ్యతిరేకించారు, పుట్టబొయే బిడ్డను చంపొద్దు, మీకు భారమైతే ఆ బిడ్డ నాకు కావలి, దేవుని ప్రసాదంగా చూసుకుంటాను, నాకు ఇవ్వండి అన్నారు.
మదర్ తెరిస్సా 1983 లో పోప్ జాన్ పాల్ సందర్శనార్ధం రోమ్ కి వెళ్ళినప్పుడు మొదటిసారి గుండెపోటు వచ్చింది. ఆ తరువాత 1989 లో రెండవసారి గుండెపోటుకు గురైనపుడు ఆమెకు కృత్రిమ పేస్ మేకర్ ను అమర్చారు. అప్పుడు ఆరోగ్యం సహకరించటం లేదని మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవికి ఆమె తన రాజీనామాను సమర్పించారు. కానీ ఆ సంస్థ లోని సభ్యులు రహస్య ఎన్నికల ద్వారా ఆమె కొనసాగించాలని కోరగా దానికి మదర్ తెరిస్సా అంగీకరించారు.
ఆ తరువాత 1996 వ సంవత్సరంలో మళ్ళీ అనారోగ్యం క్షిణించడంతో మార్చి 13, 1997 న ఆమె మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవి నుండి వైదొలిగారు. ఇక అదే సంవత్సరం సెప్టెంబర్ 5 న మదర్ తెరిస్సా తిరిగి రాని లోకానికి వెళ్లారు. ఆమె చనిపోయే నాటికి మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ 4,000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు, మరియు 100,000 పైగా సాధారణ కార్యకర్తలను కలిగి, 123 దేశాలలో 610 శాఖలను కలిగి హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది.
మదర్ తెరిస్సా 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.
ఇలా ప్రపంచమంతటికి తవ సేవ మార్గంతో ఎందరికో స్పూర్తిప్రధాతగా నిలిచినా మహొన్నత మానవతావాది, విశ్వ మాత మదర్ తెరిస్సా.