లక్ష్మి నరసింహస్వామి వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రాలలో సింహాచల ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ప్రతి సంవత్సరం అక్షయతృతీయ నాడు ఈ స్వామి నిజ రూప దర్శనం మనం ఇక్కడ చూడవచ్చు. అయితే సింహాచల ఆలయాన్ని పోలిన మరొక ఆలయం అనేది ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలో సింహాచల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రాన్ని పోలిన ఆలయం ఉంది. ఈ ఆలయంలో అన్ని పూజలు అక్కడిలాగానే జరుగుతాయి. ఉత్సవాలు కూడా ఆ తరహాలోనే జరుగుతాయి. ఇలా నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించడం వెనుక ఒక వ్యాపారి అయినా అప్పారావు గారి కృషి, పట్టుదల ఎంతగానో ఉందని చెబుతారు. అయితే అప్పారావు గారి ఇష్టదైవం సింహాచల వరాహ లక్ష్మి నరసింహస్వామి. ఆ ఇష్టంతోనే రాజమండ్రిలో సింహాచల ఆలయం మాదిరిగానే రాజమండ్రిలో కూడా ఆలయాన్ని నిర్మించాలని భావించారు. కానీ ఈ ఆలయ నిర్మాణం సగంలో ఉండగానే ఆయన మరణించారు. అప్పడూ అప్పారావు గారి కుమారులు మిగతా ఆలయాన్ని పూర్తి చేసి తండ్రి ఆశయాన్ని నెరవేర్చారు. ఇక ఆలయ విషయానికి వస్తే, సింహాచల క్షేత్రం దేవాలయంలో ఎలాంటి శిల్పాలున్నాయో అచ్చం అదేవిధంగా ఉన్న శిల్పం ఇక్కడ చెక్కారు. ఆలయ వెనుక భాగంలో గోదాదేవి ఆలయం నిర్మించారు. ప్రతినెలా మృగశిర నక్షత్రం రోజున స్వామివారి తిరుకల్యాణం, ప్రతి శుక్రవారం అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరుగుతాయి. సింహాచలం లాగానే ఈ ఆలయంలో కప్పస్తంభం కూడా ఉంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ దశమినాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సింహాచలంలోలా గానే ఇక్కడ స్వామి వారి నిజ రూప దర్శనం ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల తరువాత సహస్ర ఘటాభిషేకం చేసి అనంతరం 108 కేజీల గంథం స్వామివారికి పూస్తారు. అయితే సింహాచలం లోని పురోహితులు ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రీవారికి చందన సమర్పణ చేస్తారు. ఇలా స్వామి నిజరూప దర్శనం రోజు స్వామి వారి నుండి తొలగించిన గంధాన్ని వారం రోజుల తరువాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఈవిధంగా సింహాచల ఆలయాన్ని పోలిన ఈ ఆలయానికి స్వామి వారి నిజ రూప దర్శనం రోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.