మన దేశంలో గంగ నదిని పవిత్రంగా పూజిస్తారు. జనన మరణ సమయాలలో గంగ జలాన్ని వారి పైన చల్లితే పుణ్యులు అవుతారనే నమ్మకం ఉంది. ఇంకా పాపం చేసినవారు గంగ జలాన్ని సేవిస్తే వారికీ మోక్షం లభిస్తుందని అంటుంటారు. అయితే గంగ జలాన్ని ఎన్ని రోజులు నిల్వచేసిన పాడవకుండా ఎందుకు అలా స్వచ్చంగా ఉంటాయి మరియు గంగ నది గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం
ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం లో భాగీరధి నది ఉద్భవిస్తున్నది. ఆ ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకనందనది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని గంగ అంటారు. గంగా నది మొత్తం పొడవు సుమారు 2,510 కి.మీ.
పురాణానికి వస్తే, నిరాకారియైన గంగ బ్రహ్మదేవుని కమండలంలో ఉండేది. ఒకసారి శంకరుడు ఆలపించిన రాగానికి నారాయణుడు పరవశించిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి పాదాల నుంచి ద్రవీభవించిన జలాన్ని బ్రహ్మదేవుడు తన కమండలానికి తాకించగా నిరాకార గంగ జలంగా మారింది. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో త్రివిక్రముడై మూల్లోలోకాలను కొలిచినపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని ఆ నీటితోనే విష్ణుపాదాలను కడిగాడు. ఆ పాదము నుంచి ప్రవహించినదే దివ్యగంగ.
గంగానది 2510 కిలోమీటర్ల సుధీర్ఘ ప్రవాహంలో ఎన్నో మూలికలను గ్రహిస్తుంది. దేవతలు సైతం గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గంగానదిలో స్నానమాచరించడం వల్ల చేసిన పాపాలకు విముక్తి కలిగి కొత్త జీవితం ఆరంభమవుతుందనే నమ్మకం. మరణానంతరం అస్తికలను గంగానదిలో కలపడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దల ప్రగాఢ విశ్వాసం. గంగానదిలో మునక వల్ల అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు పితృదేవతలు తరిస్తారట.
గంగా నది లోని నీరు ఎన్ని రోజులు నిల్వఉంచిన పాడవకుండా స్వచ్చంగా ఉండటానికి పరిశోధకులు కొన్ని కారణాలు తెలిపారు. అయితే బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ గంగానదిలో ఉంటుంది, ఇది గంగానదిలోకి వచ్చే ఇతర హానికర బ్యాక్టీరియాలను చంపేస్తుంది. అంతేకాకుండా హిమాలయాలలో గంగ నుంచి గంగోత్రి వరకూ ప్రవహించేటప్పుడు, గంగానదిలోకి వేడినీటి బుగ్గలనుంచి వస్తున్న జలపాతాలు వచ్చి కలుస్తాయి, అందులోని సల్ఫర్ గంగానదిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది.
అందుకే గంగా నది నీరు అంత స్వచ్చంగా ఉంటుందని శాస్రియ ఆధారాలు తెలియచేస్తున్నాయి.