ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడ 11 వేల చిన్న చిన్న శివలింగాలు మనకు గుడి ఆవరణలో కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ఏకశిలా నిర్మితమైన అంజనేయస్వామి దర్శనం ఇస్తాడు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, పొన్నూరు గ్రామంలో శ్రీ సహస్ర లింగేశ్వరాలయం ఉంది. ఇది నూతనంగా నిర్మించిన ఆలయం. బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాధ దాసుగారు ఈ ఆలయమును 1955 లో నిర్మించారు. ఈ ఆలయం ఆవరణలో మరో నాలుగు ఆలయాలు కలవు. అందులో ఒకటి ఏకశిలా నిర్మిత ఆంజనేయస్వామి వారి ఆలయం. రెండవది ఏకశిలా నిర్మిత గరుత్మంతుల వారి ఆలయం. మూడవది దశావతారాల ఆలయం. నాలుగవది కాలభైరవస్వామి ఆలయం. ఈవిధంగా ఇది అనేక ఆలయాల సంగమ ప్రదేశంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ ఆలయంలో సహస్ర లింగేశ్వరాలయాం తూర్పు ముఖంగా ఉంది. ఈ ఆలయం మూలవిరాట్టు శివవిగ్రహము, ఆయనకు ఉత్తర, దక్షిణ పడమర దిశలయందు చిన్న చిన్న శివలింగాలు పదకొండు వేలకు పైగా కనిపిస్తుంటాయి. అందువల్లనే ఇది సహస్రలింగేశ్వరాలయం గా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో శివుడికి ఎదురుగా నందీశ్వరుడు, ఆ నందీశ్వరునికి ముందు నాగరూప దేవతామూర్తి, విగ్నేశ్వరుడు ఎడమ బాగాన పార్వతి అమ్మవారు, కుడి బాగాన శ్రీ వీరభద్రస్వామి, శ్రీ భద్రకాళి, విశాలమైన మండపంలో పెద్ద నంది ఆ నందికి ఎడమ బాగాన నవగ్రహములు, కుడివైపున షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొదలగు దేవతమూర్తులు మనకు దర్శనం ఇస్తారు. రెండవ ఆలయం ఏకశిలా నిర్మిత ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంనందు 24 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పు గల ఏకశిలా నిర్మిత అంజనేయస్వామి వారి విగ్రహం కలదు. మూడవ ఆలయము గరుత్మంతుల వారి ఆలయంలో 30 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పు గల ఏకశిలా నిర్మిత గరుత్మంతుల వారు ప్రతిష్ఠులై ఉన్నారు. ఇలా ఏర్పడిన ఈ ఐదు ఆలయాలలో ప్రతి ఆలయంలోనూ ఒక ధ్వజస్థంభం, అఖండజ్యోతి మందిరములు మనకు కనువిందు చేస్తాయి.