ఇక్కడి ఆలయంలో శివుడిని సిద్దేశ్వరస్వామిగా కొలుస్తారు. వెండికొండపైన వెలసిన స్వామి కనుక ఈయనను శ్రీ వెండికొండ సిద్దేశ్వరస్వామి అని అంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? శివుడిని అలా ఎందుకు పిలుస్తారు? వెండికొండ అనే పేరు ఎలా వచ్చిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ లోని సిద్ధుల గుట్టపై శ్రీ వెండికొండ సిద్దేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది ఒక ప్రాచీన దేవాలయం. ఈ ఆలయంలోని స్వామివారు కోర్కెలు సిద్ది కలిగించే దైవం కనుక ఈ స్వామికి సిద్దేశ్వరస్వామి అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభువుగా వెలిశారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయానికి పై కప్పు అనేది లేదు. ఈ గుట్ట అంత తెల్లగా ఉన్నదీ కాబట్టి దీనికి వెండి కొండ అనే పేరు వచ్చినది. ఇంకా సిద్ద పురుషులు తిరిగిన ప్రదేశం కనుక ఈ గుట్టకు సిద్దులగుట్ట అనే పేరు వచ్చిందని అంటారు. పూర్వం కొన్ని సంవత్సరాల క్రిందట ఈ ప్రదేశంలో జనసంచారం ఉండేది కాదని ఆ రోజుల్లో ఈ నిర్మానుష్యమైన అడవుల్లో సిద్దులు తపస్సు చేసుకుంటూ, ఈ సిద్దేశ్వరుని పూజించేవారని చెబుతారు. ఇక పురాణానికి వస్తే, కాశీయాత్ర చేసిన ఓ సిద్ధపురుషుడు ఈ ప్రాంతానికి వచ్చి, ఈ ప్రాంతంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించాలనుకున్నాడు. అప్పుడు వెంటనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై శివలింగ ప్రతిష్టకు అనుమతిని ఇచ్చాడట. సిద్ధుడు ఆ శివలింగాన్ని అచట ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేసినట్లు స్థల పురాణం తెలియచేస్తుంది. అయితే ఈ గుడి ప్రాంగణంలో ఒక గుహ ఉండేదని దీనిగుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ఒక ద్వారం ఉండేదని భక్తులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ఆ గుహాద్వారాన్ని మూసివేశారని స్థానికులు చెబుతున్నారు. ఇక ఆలయ విషయానికి వస్తే, స్వామివారి ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా నంది, భవానీమాత, వినాయకుడు, వీరభద్రేశ్వరస్వామి, ఆంజనేయస్వామి మొదలగు దేవతామూర్తులు భక్తులకి దర్శనం ఇస్తారు. ఈవిధంగా ఈ ఆలయం అపూర్వ శిల్పకళా వైభవంతో, చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, చక్కని సరోవరంతో ఎంతో సుందరంగా అందంగా అలరారుచున్నది.