Home Unknown facts దీపావళి తరువాత అన్నదమ్ములు తోబుట్టువు ఇంటికి వచ్చే పండగ…

దీపావళి తరువాత అన్నదమ్ములు తోబుట్టువు ఇంటికి వచ్చే పండగ…

0

సనాతన ధర్మంలోని పండుగలు, పర్వదినాలు సమైక్యతత్వాన్ని, సమష్టి భావాన్ని ఆకాంక్షిస్తాయి. కుటుంబంలోని జీవన మాధుర్యానికి, సాంప్రదాయ సౌరభానికి ప్రతీక- యమద్వితీయ. సహోదరుల మధ్య సదవగాహన, సౌమనస్య పూరిత ఆపేక్షల వృద్ధికి యమద్వితీయనాడు నిర్వహించే భగినీ హస్తభోజనం ఉపకరిస్తుంది.

bhai doojకార్తీక శుద్ధ విదియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. దీపావళి వెళ్లిన రెండు రోజులకు వచ్చే విదియ నాడు భగినీ హస్త భోజనం జరుపుకుంటారు. ఈ రోజును యమ ద్వితీయ, పుష్ప ద్వితీయ, కాంతి ద్వితీయ, భ్రాతృ విదియ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. భగినీ హస్త భోజనం గురించి విభిన్న కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో చుద్దాం.

అన్నా,చెల్లెళ్ళ పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ, ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ల పండగగా జరుపుకొంటాం… అదే భగిని హస్త భోజనం. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. అందుకే దీనిని భగిని హస్త భోజనం అంటారు.

దీని వెనకు ఒక పురాణ గాధ ఉంది. యముడి చెల్లెలు యమున. అన్నను ఆమె ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. రోజుల తరబడి ఆయనకు వీలుపడదు. ఓ రోజున అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాన్ని హస్తగతం చేసుకునేందుకు యముడు పాశాలతో వెళ్తాడు. అప్పుడు ఆ బాల భక్తుడు మహాశివుణ్ని శరణు వేడుకుంటాడు. స్వామి త్రిశూలం తీసుకుని యముడి వెంటపడటంతో, ఆయన తన చెల్లెలి ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది. రుచికరమైన పిండివంటలతో విందు వడ్డిస్తుంది. భోజనం చేస్తున్న వారిని సంహరించరాదని శివుడు తిరిగి వెళ్లిపోతాడు. భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగినట్లవుతుంది.

మరోవైపు, అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణనూ కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. ఆమెను ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి, ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగరాదని యమున కోరుతుంది.

ఆయన పరమానంద భరితుడవుతాడు. ఏటా కార్తీక శుద్ధ విదియనాడు ఇంటికి వచ్చి, ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయమూ ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. ‘నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు, సోదరుడికి ఈరోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది’ అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు పొంది యముడు తిరిగి వెళ్తాడు.

యమునకు , యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే ‘యమ ద్వితీయ’ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి ‘భగినీ హస్తభోజనం’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు-సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది. పలువురు నేడు చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తారు. అంతకుముందు (కార్తిక శుద్ధ పాడ్యమి) పూజలందుకున్న బలి ఇప్పుడు వీడ్కోలు పొంది, పాతాళానికి వెళ్తాడనీ కొందరు విశ్వసిస్తారు.

ఇదే పర్వదినాన యముడితో పాటు చిత్రగుప్తుడు కూడా మహిళల పూజలందుకుంటాడు. ఈ రోజు చేసే దానధర్మాల కారణంగా విశేష పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదిన ప్రత్యేకతను స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి, భవిష్య పురాణం వంటి గ్రంథాలు విపులీకరించాయి.

Exit mobile version