కరోనా మహమ్మారి మనుషుల శారీరక ఆరోగ్యాలతో పాటు మానసిక ఆరోగ్యాలతో సైతం ఆడుకుంటోంది. కరోనా కారణంగా చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారింది. శారీరక శ్రమ తగ్గిపోవడం, పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఒత్తిడి, ఆందోళన బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యపై దృష్టి పెట్టకపోతే దీర్ఘకాలంలో ఇతర తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఉండే కొన్ని రకాల పోషకాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయని పరిశోధనల్లో తేలింది. ఒత్తిడి, ఆందోళన వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల ఆకలి పెరగడం, మధుమేహం, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. సహజ మార్గాల్లో మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పదార్థాలు కృషి చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆహారం తో పాటుగా ఇతర జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
ఒత్తిడిని చిత్తు చేయడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బాదం పప్పు, జీడి పప్పు, వేరు శెనగలు, వాల్నట్స్ వంటివి మెదుడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఒత్తిడిని చిత్తు చేయడంలో బెర్రీ పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్ బెర్రీలలో ఉండే ఆంథో సయనిన్లు ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి.
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సైతం మానసిక ఆందోళనను దూరం చేస్తాయి. కాబట్టి చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచుతుంది కాబట్టి.. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది చాలా అవసరం.
పాలకూరలో ఉండే మెగ్నిషియం సెరొటోనిన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. సెరొటోనిన్ ఉత్పత్తి మనుషుల మూడ్ను మారుస్తుంది. కాబట్టి డిప్రెషన్, ఒత్తిడితో సతమతమయ్యే వారు పాలకూరను నిత్యం తీసుకుంటూ ఉండాలి.
ఒత్తిడిని తగ్గించడంతో డార్క్ చాక్లెట్లు కీలకపాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీంతో మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది.
ఇక బాగా ఊపిరి తీసుకోవడం, ధ్యానం, యోగా తదితర చిట్కాల ద్వారా ఒత్తిడిని చాలా వరకు అదుపు చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు గుండె వేగం పెరుగుతుంది. అందువల్ల ఊపిరిపై దృష్టిపెట్టడం ద్వారా గుండె వేగాన్ని నియంత్రించవచ్చు. అయితే ఇక్కడ 4-7-8 సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే.. 4 సెకెన్ల పాటు ఊపిరి తీసుకుంటే.. 7 సెకెన్లపాటు బిగబట్టి ఉండాలి. ఆ తర్వాత 8 సెకెన్ల పాటు నెమ్మదిగా ఊపిరి వదలాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి.
నిద్ర మనిషి జీవితంలో తప్పక ఉండాలి. ప్రస్తుత జీవనశైలితో నిద్రవేళలు క్రమంగా తగ్గుతున్నాయి. కనీసం మనిషికి రోజుకు 7నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. అప్పుడు ఒత్తిడి తగ్గి ఆరోగ్యాంగా ఉండగలరు. ఒత్తిడి తగ్గాలి అంటే వ్యాయామం, వాకింగ్, రన్నింగ్ తప్పక చెయ్యాలి. కనీసం రోజుకు 45నిమిషాల పాటు ఈ వ్యాయామలు చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండడానికి సహాయ పడుతుంది.
బాగా ఒత్తిడికి గురైనప్పుడు మీ ఆత్మీయులతో మాట్లాడండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం వల్ల ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా నవ్వు చాలా రోగాలను నయం చేస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా మానసిక సమస్యలకు నవ్వే మందు. ఒత్తిడిగా అనిపించినప్పుడు నలుగురితో కలిసి నవ్వుకోవడం, కామెడీ ప్రోగ్రామ్లు చూడటం వల్ల ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే.. నవ్వుతున్నప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను తీసుకుంటాం. ఇది గుండె, ఊపిరితిత్తులు, కండరాలను ప్రేరేపిస్తుంది.