ప్రతి రోజూ గుడికి వెళ్లే పద్దతిని మన పెద్దలు మనకు చిన్నతనం నుంచే అలవాటు చేశారు. గుడికి వెళ్ళడమంటే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలుకూడా ఉంటాయి.
సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పవిత్ర క్షేత్రాలను, ప్రదేశాలను దర్శించినప్పుడు చెప్పులు బయటవదిలి వెళ్లడం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది. కేవలం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మన ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడుస్తుంటాము.
మన ఇంటిలో కూడా పూజ గది ఉండటం వల్ల దేవుని గది వద్దకు చెప్పులు వేసుకోకుండా గుమ్మం బయటే వదిలి రావడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని అనారోగ్య సమస్యల వల్ల చాలామంది ఇంటిలో కూడా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.
అయితే మన ఇంట్లో కూడా కొన్ని ప్రదేశాలలో చెప్పులు అసలు వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. అయితే ఆ ప్రదేశాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం…
సాధారణంగా మనం ఇంట్లో దేవుడి గది ఉన్నచోటకు చెప్పులు వేసుకొని వెళ్ళము. అదేవిధంగా మన ఇంట్లో నిత్యవసర వస్తువులు భద్రపరిచి ఉన్న ప్రదేశానికి కూడా చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు.
బంగారం, డబ్బులు దాచి ఉంచే బీరువా, వంట గదిలో కూడా చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అని పండితులు చెబుతున్నారు. సాధారణంగా మనం వంటగదిలో ఆహారం తయారు చేసుకుంటాం. నిప్పును సాక్షాత్తు అగ్నిదేవుడుగా భావిస్తాము కాబట్టి వంటగదిలో చెప్పులు వేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు.
ఇక డబ్బులు, బంగారం దాచి పెట్టే చోటకి కూడా చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే బంగారాన్ని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకని ఆ ప్రదేశానికి వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు. అదేవిధంగా పుణ్య నదులు అయినటువంటి గంగ,కృష్ణ ,గోదావరి నదులను సాక్షాత్తు దైవ సమానంగా భావిస్తారు.
కాబట్టి అలాంటి నదులను సందర్శించేటప్పుడు, పుష్కరాల సమయంలో లేదా కుంభమేళా జరిగిన సమయంలో చెప్పులు ధరించి నదిలోకి దిగ కూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అందుకే మన పూర్వీకులు ఎక్కువభాగం చెప్పులు లేకుండా నడవడం అలవాటు పడేవారు.