శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి కొలువై ఉన్న ఈ స్వామిని సత్యదేవుడు అని కూడా అంటారు. ఇక్కడ ఒకేసారి వందలాది మంది దంపతులు కూర్చొని శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతాన్ని చేసుకోవడం ఒక ప్రత్యేకత. ఈ ఆలయంలో సత్యనారయణస్వామికి కుడి పక్కన ఈశ్వరుడు, ఎడమపక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇలా ఒకే పీఠం పై ముగ్గురు మూర్తులు కొలువుండే దేవాలయం మరెక్కడా లేదు. అయితే అన్నవరం ఆలయానికి ఐఎస్వో గుర్తింపు లభించింది. ఆ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలానికి చెందిన అన్నవరం గ్రామంలో పంపానది తీరమున గల రత్నగిరి కొండపైన శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి వారి దివ్యక్షేత్రం కలదు. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి వారిని సత్యదేవుడు అని కూడా అంటారు. ఇక విషయంలోకి వెళితే, ఈ ఆలయానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్వో గుర్తింపు దక్కింది. సత్యదేవుని ప్రసాదం ఇంకా, ఆలయంలో అందుతున్న సేవలకు రెండు విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్వో గుర్తింపు లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆలయంలో లేనివిధంగా అన్నవరంలో సత్యదేవుని గోధుమ నూక ప్రసాదానికి ఆహార భద్రత నాణ్యతా ప్రమాణాల విభాగంలో ఐఎస్వో 22000 :2005 గుర్తింపు దక్కింది. ఆలయంలో అందుతున్న సేవలు, పనితీరు, స్వచ్ఛతా ప్రమాణాలకు ఐఎస్వో 9001:2015 గుర్తింపు లభించింది. ఈవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన అన్నవరం సత్యదేవుడి ఆలయం రెండు విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్వో గుర్తింపు లభించింది.
హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ గుర్తింపు పత్రాన్ని ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్, ఈవో సురేష్బాబుకు ఆదివారం నాడు అందించారు. ఈ ఆలయంలో ప్రతిరోజు సామూహిక దంపతులు శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతాలు, కల్యాణ , మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి ప్రతినిత్యం వేలసంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి, పూజించి తరిస్తారు.