అష్టలక్ష్మి దేవతలు ఈ ఆలయంలో కొలువై పూజలందుకుంటున్నారు. అయితే ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది? ఆ అష్టలక్ష్ములు ఎవరు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని, హైదరాబాద్ నగర శివార్లలోని వాసవి కాలనిలో శ్రీ అష్ట లక్ష్మి దేవాలయం కలదు. ఈ ఆలయం నిర్మించడం వెనుక చాలా కృషి దాగి ఉంది. ఈ కాలనీ వాసులు ఒక ఆలయ నిర్మించాలని తలచి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి సలహా మేరకు అష్టలక్ష్మి ఆలయాన్ని నిర్మించడానికి నిర్ణయించుకున్నారు. ఇక 1996 వ సంవత్సరం ఏప్రిల్ 28 న కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వాములవారు ప్రతిష్ఠకుంబాభిషేక కార్యక్రమాలను నిర్వహించి విగ్రహాలు ప్రతిష్టించారు. ఆనాటి నుండి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ఆరాధనలందుకుంటుంది. ప్రధాన ద్వారాన్ని దాటి ఆలయంలోకి ప్రవేశిస్తే రెండు అంతస్తులుగా ఆలయం దర్శనం ఇస్తుంది. గర్భాలయ మండపంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రధాన గర్భాలయం, దాని చుట్టూ మరో ఏడు గర్భాలయాలు ఉన్నాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో శంఖు చక్ర అభయ, వరద ముద్రలో దివ్యాలంకార శోభితులై భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇంకా మిగతా ఏడు గర్భాలయాల్లో శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజ లక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధ్యానలక్ష్మి, శ్రీవిజయలక్ష్మి, శ్రీవీరలక్ష్మి, శ్రీఐశ్వర్యలక్ష్మి అమ్మవార్లు కొలువై పూజలందుకుతున్నారు. గర్భాలయంలో శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి ఉండటం వలన స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని, వీరిని దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్డస్తాయని శాస్ర వచనం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ విదియ మొదలు వరం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. అయితే అంకురార్పణ మరుసటి రోజున జరిగే ధ్వజారోహణ రోజున సంతానం లేని దంపతులు ఈ పూజలో పాల్గొని గరుడ ప్రసాదం తీసుకుంటే వారికీ సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.