ఒకే కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కబడిన వైనం ఇక్కడ ఎంతో అపురూపంగా ఉంటూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చుట్టూ ఉన్న నల్లమల అడవిలో ఎక్కడ చూసినా దేవుళ్ళ శిలారూపాలే కనిపిస్తుంటాయి. మరి ఎంతో ప్రసిద్ధమైన ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఈ భైరవకోన విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, నెల్లూరు – ప్రకాశం జిల్లాల సరిహద్దులో చంద్రశేఖర పురం మండలంలో కొత్తపల్లి గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో భైరవకోన గుహాలయం ఉంది. అయితే పార్వతి పరమేశ్వరులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని వారికీ ఈ ప్రాంతం ఎంతగానో నచ్చిందని దాంతో అమర్నాథ్ లో కనిపించే శివలింగాన్ని పోలిన శివలింగాన్ని ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టి వెళ్లారని పురాణం. దాదాపుగా 250 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అడవి ప్రాంతంలో ఎక్కడచూసినా దేవత మూర్తుల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒకే కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కి ఎంతో అపురూపంగా ఉన్నాయి. అంతేకాకుండా ఒకే రాతిలో మలచిన ఎనిమిది శివాలయాల్లో ఎనిమిది రకాలుగా శివరూపాన్ని మలిచారు. అయితే ఈ ఆలయంలోని శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాలను పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తారు. అవి మధ్యప్రదేశ్ లోని అమరనాథ్ లో కనిపించే శశినాగలింగం, మేరుపర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశిగంగా తీరంలోని విశ్వేశ్వర లింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వరలింగం, ఇంకా బర్గేశ్వరలింగం ప్రధానమైనవి. ఇక్కడ ఉన్న గుహాలయాల్లో ప్రధాన దైవం బర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఆయన పేరు మీదుగానే ఈ క్షేత్రాన్ని భైరవక్షేత్రం గా, భైరవకోనగా పిలుస్తుంటారు. అయితే ఒకప్పుడు ఈ క్షేత్రాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడని అందుకే ఇది భైరవకోనగా పిలువబడుతుంది అని అంటారు. భైరవకోనలో ఏడు ఆలయాల మధ్యలో సుమారు రెండు అడుగుల లోతున దుర్గాదేవి ఆలయం ఉంది. ఇక్కడ కనుకదుర్గ దేవి విగ్రహం అధ్బుతంగా ఉంటుంది. ఈ విగ్రహం దుర్గమ్మ తల్లి,సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవిల ముఖాలతో కనిపిస్తూ భక్తులని అలరిస్తుంది. దుర్గాదేవి ఆలయం కొంచెం క్రిందిభాగంలో సెలయేరు ప్రవహిస్తుంటుంది. ఈ సెలయేరు వేసవిలో కూడా ఎండిపోదు. ఈ సెలయేరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే అతిగా వర్షాలు పడినప్పుడు ఈ సెలయేరు ఎంత వేగంగా ప్రవించినప్పటికీ ఆలయములోకి ఒక చుక్క నీరు అనేది కూడా రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ ఉన్న గుహలలో ఏడవ గుహ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఎనిమిదవ గుహలో శివలింగంతో పాటు బ్రహ్మ, విష్ణు విగ్రహాలు కూడా చెక్కడం ఒక విశేషం. ఇలా త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. ఇంకా ఇక్కడ ఉన్న మరో అధ్భూతం ఏంటంటే, ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున రాత్రి 7 నుండి 9 గంటల సమయంలో చంద్రుని కిరణాలు దుర్గాదేవి ఆలయంలోకి నేరుగా ప్రవేశిస్తాయి. ఈ అధ్బుతాన్ని చూడటానికి వేలాదిమంది భక్తులు ఆ సమయంలో ఆలయాన్ని దర్శిస్తారు.