స్థలం ఎక్కువగా తీసుకుంటుందని పట్టణాల్లో, నగరాల్లో పెరగనివ్వట్లేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మర్రి చెట్లే ఎక్కువగా పెరుగుతాయి. మర్రిచెట్టు కింద కూర్చుని సేద తీరితే ఎంతో మంచిదని మన పెద్దవారు చెబుతుంటారు. చెట్టు కింద కూర్చుంటేనే అంత మంచిదైతే మర్రిచెట్టు ఆకులను తింటే ఇంకా ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మర్రి చెట్టు అనేక వ్యాధుల, అంటురోగాల చికిత్స కోసం ఉపయోగపడుతుందని ఆయుర్వేదంలో చెప్పబడింది.
మర్రి చెట్టునే వట వృక్షం అని కూడా అంటారు. ఇంగ్లిష్లో బనియన్ ట్రీ అని, హిందీలో బర్గద్ అని పిలుస్తారు. మర్రి చెట్టుకు చెందిన వేర్లు, కాండం, ఆకులు, చిగుళ్లు, పువ్వులు అన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మర్రి చెట్టు ఆకుల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బాగా ముదిరిన మర్రి ఆకులను ఎండించి ఒక లీటరు మంచినీటిలో 10 గ్రాముల బరువు ఉన్న మర్రి ఆకులను వేసి పావులీటరు కషాయము మిగిలేవరకు చిన్న మంటపై మరగపెట్టి దించి వడపోసి అందులో మూడు చిటికెలు ఉప్పు కలిపి ఉదయం, సాయంత్రం తాగుతుండాలి. దీని వల్ల పీడకలలు రావటం, గుండె బరువై వూపిరాడక పోవటం, నిద్రలో పెద్దగా అరవటం భయపడడం తగ్గిపోతాయి.
మర్రి ఆకులు 20 గ్రాములు తీసుకొని కొంచెం నలగ గొట్టి అరలీటరు మంచినీటిలో వేసి పావు లీటరు కషాయము మిగిలే వరకు చిన్నమంటపై మరగబెట్టి దించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత దానిలో ఒక చెంచా మంచి తేనె 1 చెంచా కలకండ కలిపి రెండుపూటలా సేవిస్తుంటే రక్తములోని మాలిన్యాలు తొలగిపోయి రక్తము శుభ్రపడి చర్మవ్యాధులు తగ్గిపోతాయి.
లేత మర్రి మొగ్గలు 10 గ్రాములు గ్రహించి తగినంత నీరు కలిపి మెత్తగా నూరి బట్టలో వడపోసి కండ చక్కెర కలిపి రెండు పూటలా త్రాగుతుంటే విరేచనాలు, నీళ్ల విరేచనాలు కట్టుకుంటాయి. లేత మర్రి ఆకులు 25 గ్రాములు తీసుకొని పావు లీటరు మంచి నీటిలో కలిపి మెత్తగా నూరి గుడ్డలో వడపోసుకుని రోజూ త్రాగుతుంటే రక్తమొలలు పూర్తిగా తగ్గిపోతాయి. రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది.
లేత మర్రి ఆకులు 10 గ్రాములు తీసుకొని మంచినీరు 150 గ్రాములు కలిపి మెత్తగా నూరి పల్చని గుడ్డతో వడకట్టాలి. అందులో కొంచెం కలకండ కలిపి రెండుపూటలా త్రాగుతుంటే గుండెదడ పూర్తిగా తగ్గిపోతుంది. మర్రి ఆకులు 20 గ్రాములు, 7 లవంగాలు ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బట్టలో వేసి రసం పిండి దానిలో కొంచెం కలకండ కలిపి త్రాగితే వాంతులు వెంటనే తగ్గిపోతాయి.
మర్రి ఆకులను నీడలో ఎండబెట్ట దంచి పొడిచేసి సమానముగా చక్కెర కలిపి నిలువ చేసుకోవాలి. ఉదయం సాయంత్రం 1/2 చెంచా మోతాదుగా ఈ పొడిని మంచి నీటితో సేవిస్తుంటే స్త్రీల బట్టంటు రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి. మర్రి ఆకులను నీటిలో వేసి చిన్నమంటపైన మరగబెడుతూ కషాయం చిక్కబడే వరకు మరిగించి దించి ఆ కషాయంలో తగినంత కలకండ కలిపి సేవిస్తుంటే అపరిమితమైన వీర్యవృద్థి కలుగుతుంది.
లేత మర్రి మొగ్గలు 10 గ్రాములు గ్రహంచి దానితో పాటు బాగా లేతగా ఉన్న దేశవాళీ వంకాయ ఒకటి కలిపి, ఆ రెండింటినీ కలుపుకుని తింటుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అలాగే మర్రి ఆకుల చూర్ణంను చేసుకొని రెండు పూటలా 1/4 చెంచా మోతాదుగా ఈ పొడిని మంచినీటితో సేవిస్తుంటే కీళ్ళనొప్పులు అద్భుతంగా పనిచేస్తాయి. మర్రి ఆకుల పాలు, ఆవాల నూనెలను 2 చుక్కల మోతాదులో తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని 2 చుక్కల చొప్పున చెవిలో వేస్తుంటే చెవి నొప్పి తగ్గుతుంది. చెవిలో ఉండే పురుగులు చనిపోతాయి.
మర్రి లేత ఆకులు లేదా ఊడల చిగుళ్ళను 5 లేదా 6 తీసుకోవాలి. అలాగే ఎర్ర కందిపప్పును 10-20 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. రెండింటినీ నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ ముద్దను ముఖానికి ఫేస్ ప్యాక్లా వేసుకోవచ్చు. కొంత సేపటి తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. లేత మర్రి ఆకుల రసంలో ఆవాల నూనె కలిపి దాన్ని వేడి చేసి సీసాలో నిల్వ చేయాలి. దాన్ని రోజూ జుట్టుకు రాసుకుంటుండాలి. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.