ప్రపంచానికి ఆధ్యాత్మిక పరిమాళాన్ని అందించిన భారత్లో కొన్ని వేల సంవత్సరాలుగా పూరాతన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఇవన్ని ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగలే. అయితే ఇటీవలె వచ్చిన అధునాతన పద్ధతులతో ఈ సాంప్రదాయాలే పర్యావరణానికి కీడు చేస్తున్నాయి. ఒకప్పుడు మట్టితో తయారు చేసే వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకునేవారు. చాలా మందికి రంగురంగుల రసాయనాలతో తయారు చేసిన గణపతులు ఇష్టం.. ఈ నేపథ్యంలో మట్టి గణనాథుల విశిష్టత తెలుసుకుందాం…
ప్రకృతిహితమే పండగల పరమార్థం…
పర్యావరణానికి హానికలిగించే చర్యలను ప్రతి మతం వ్యతిరేకిస్తుంది. ఇక భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండగుల వెనుకున్న లక్ష్యం కూడా ఇదే.
సునిశితంగా గమనిస్తే.. ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిలో మమేకమవుతూ నేల-నీరు, చెట్టు – పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం.
వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.. మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం చేసుకునేకంటే.. ఉన్నంతలో పండగ చేసుకొని పది మందికి మంచిని పంచిపెట్టడం మేలు.
ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతోంది. దీనికి అంత ప్రాధాన్యత వచ్చిందంటే.. మనవల్ల ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం చేసే పనుల వల్ల ఎదుటివారికి ఏ చిన్న కష్టం రాకూడదు.. మన పండగల పరమార్థం కూడా ఇదే.
మనుషులను, మూగ జీవాలను ఇబ్బందులకు గురి చేయమని ఏ దేవుడూ చెప్పలేదు. చేతనైతే ఇంత సాయం చేయాల్సింది పోయి.. తెలిసీ తెలిసీ ఇతరులను ఇబ్బందుల్లో పడేద్దామా..? మట్టి గణపతులను పూజించడంతోనే సరిపోదు.. వీధుల్లోని రహదారులన్నీ ఆక్రమించి అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించి, సామాన్య మానవుడికి ఇబ్బంది కలిగించే పనులకు కూడా మానుకోవాలి. కాలనీ వాళ్లంతా కలసి ఒకే గణపతిని పెట్టుకుంటే.. దేవుడు దీవించడా? ఊరు వాళ్లంతా కలిసి ఒక్కటే విగ్రహాన్ని పూజిస్తే గణపతి ఊరుకోడా?
మరోవైపు మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా చైతన్యం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీన్ని మరో జాతీయ ఉద్యమంలా ఉరుకులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎలాంటి మంచిపనికైనా మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆచరిస్తే ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. భూమిని చీల్చుకొస్తూ పుట్టే మొలక పచ్చని మొక్కలా ఎదిగినట్టు.. ఒక మంచి పండగ సందర్భంగా మొగ్గ తొడిగిన ఈ ఆలోచన ఉన్నత ఆశయాల దిశగా ఎదిగేట్టు ఇప్పుడే ప్రయత్నం ప్రారంభిద్దాం