శివుడిని లింగ రూపంలో పూజిస్తారనేది అందరికి తెలిసిందే. దాదాపు దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో మహేశ్వరుడిని లింగ రూపంలోనే పూజిస్తారు.
ఈ నేపథ్యంలో సృష్టి, స్థితి, లయకారకులుగా బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరులను పూజిస్తాము. అయితే ఈ ముగ్గురు కూడా వేరువేరు ఆలయాలలో ప్రత్యేక పూజలతో పూజిస్తాము.
కానీ సృష్టికర్త అయిన ఈ ముగ్గురు త్రిమూర్తులను కలిసి ఒకే ఆలయంలో, ఒకే లింగం పై దర్శనమివ్వడం మనం తమిళనాడులో చూడవచ్చు. ఇంత అద్భుతమైన ఈ త్రిమూర్తుల దర్శన ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
పవిత్రమైన 108 శైవ క్షేత్రాలలో సుచింద్రం ఒకటి.
ఈ ఆలయంలో కేవలం శైవులు మాత్రమే కాకుండా వైష్ణవులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు. తమిళనాడులోని కన్యాకుమారికి దగ్గరగా సుచింద్రం ఉంది.
స్థాణుమలయన్ ఆలయంలోని గర్భగుడిలో ఒకే లింగంలో. పై భాగంలో శివుడు, మధ్య భాగంలో విష్ణువు, కింది భాగంలో బ్రహ్మ ఈ ముగ్గురు మనకు దర్శనం కల్పిస్తారు.
స్థాణు’ అంటే శివుడు, ‘మల్’ అంటే విష్ణువు, ‘అయన్’ అంటే బ్రహ్మ.ఈ ముగ్గురి పేర్ల మీదుగానే ఆలయానికి ఆ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ విధంగా త్రిమూర్తులు కలిసి ఒకే లింగంపై దర్శనం ఇవ్వడానికి కారణం ఉందని పురాణాలు చెబుతాయి. పూర్వం అనసూయ దేవిని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు ముగ్గురిని అనసూయ దేవి తన పాతివ్రత్య ప్రభావంతో ఈ ముగ్గురు చిన్నపిల్లలుగా మారిపోతారు. అయితే లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనసూయ దేవిని వేడుకోగా వారికి విముక్తి కల్పించిందని ఆ సమయంలో త్రిమూర్తులు ముగ్గురు స్వయంభుగా ఒకే లింగంపై వెలిశారని పురాణాలు చెబుతాయి.
అదేవిధంగా ఏ ఆలయంలో కనిపించనటువంటి ఇరవై ఆరు ముఖాలు, 52 చేతులు కలిగి ఉన్న శివుడి శిల్పం ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తుంది. అదేవిధంగా ఇరవై రెండు అడుగులు ఎత్తు కలిగిన హనుమంతుని విగ్రహం కూడా ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు.
ఇక్కడ ఆంజనేయుడికి సింధూరానికి బదులుగా వెన్నతో స్వామివారికి పూజ చేస్తారు. లంకాదహనం జరిగిన సమయంలో ఆంజనేయ తోక అంటుకోవడం వల్ల చల్లదనం కోసం తోక పై వెన్న వ్రాయడం వల్ల స్వామివారు అనుగ్రహిస్తారని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు.