కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే స్తంభింపజేసింది. రెండు దశలలో ఎంతోమందిని పొట్టనబెట్టుకుందీ వైరస్. ఎట్టకేలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తలో టీకా తీసుకునేందుకు జనం సందేహించారు. సెకండ్ వేవ్ దెబ్బకు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయినా, రెండో దశ ఇంకా సమసిపోలేదు. అంతలోనే, థర్డ్ వేవ్ ప్రచారం తెరపైకి వచ్చింది. దాంతో మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయినా కూడా కొందరు కరోనా వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ దగ్గర నుంచి డెల్టా వేరియంట్ వంటివి పుట్టుకొస్తున్నాయి. దీంతో కోవిడ్ బూస్టర్ డోస్ అవసరం చాలా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతొ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో బూస్టర్ షాట్కు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది.
మనదేశంలోనూ భారత్ బయోటెక్ ప్రస్తుతం వ్యాక్సిన్ బూస్టర్ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. బూస్టర్ వ్యాక్సిన్ షాట్ల ట్రయల్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే 60 ఏళ్లు దాటిన వ్యక్తులకు బూస్టర్ షాట్లను అందించడం ప్రారంభించాయి. రెండు డోసులూ తీసుకున్నవారు కూడా బూస్టర్ డోస్ తీసుకుంటేనే కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నవారు, ఇతర వ్యాధులతో ఇబ్బందిపడేవారిలో కరోనా వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. వీరికి కోవిడ్ బూస్టర్ డోస్ అవసరం చాలా ఉంది.
బూస్టర్ షాట్ రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. సాధారణంగా వైరస్పై పోరాడేందుకు తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ల ప్రభావం కొంత కాలానికి తగ్గడం సహజం. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్ల కారణంగా.. కోవిడ్ వ్యాక్సిన్స్ పూర్తిగా తీసుకున్న వారు కూడా మళ్లీ కరోనా బారిన పడే ప్రమాదం ఉంటుంది. అలా అని మనం తీసుకున్న వ్యాక్సిన్ అంత ప్రభావవంతంగా పని చేయదని కాదు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ ప్రకారం.. విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్స్ బాగా పని చేస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం బారిన పడకుండా, ఆసుపత్రిలో చేరకుండా, ప్రాణాంతకం కాకుండా ఉండేందుకు కోవిడ్ టీకాలు బాగా పనిచేస్తున్నాయి. డెల్టా వేరియంట్ విస్తరిస్తున్న క్రమంలో ఇతర వ్యాధులతో బాధపడే వారిలో వ్యాధినిరోధకత శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. అందుకే రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉన్నవారికి కోవిడ్ బూస్టర్ డోస్ అవసరం.
కణితులు, బ్లడ్ క్యాన్సర్కు చికిత్స పొందుతున్న వ్యక్తులు, హెచ్ఐవీ వ్యాధి అడ్వాన్స్ స్టేజీలో ఉన్న వాళ్లు లేదా ఇంకా చికిత్స తీసుకోనివాళ్లు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు, రోగనిరోధక శక్తిని తగ్గించే మందులను తీసుకుంటున్న వ్యక్తులు బూస్టర్ షాట్ ఎంత త్వరగా తీసుకుంటే అంత మేలు. దీనివల్ల కొత్తగా అభివృద్ధి చెందుతున్న కోవిడ్ వేరియంట్ల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవాలంటే మూడో డోస్ కూడా తప్పనిసరి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మారిపోతున్న వేరియంట్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 2 డోసులు వేయించుకున్న వాళ్లు, మూడో డోస్ కూడా వేయించుకునే అవసరం ఏర్పడిందని చెబుతున్నారు.
బూస్టర్.. అంటే అదనపు శక్తినివ్వడం. మొదటి రెండు డోసుల వ్యాక్సిన్ల వల్ల యాంటీబాడీస్ ఏర్పడి ఉంటాయి. బూస్టర్ వల్ల అవి మరింత బలోపేతం అవుతాయి. భవిష్యత్తులో కొత్తకొత్త వేరియంట్లు వచ్చినా, అడ్డుకునేందుకు మన రోగ నిరోధక వ్యవస్థకు ఆ మాత్రం సత్తువ అవసరమే. చాలా మంది యాంటీబాడీస్ స్థాయి ఆధారంగా టీకా వేయించుకోవడమో లేదా బూస్టర్ గురించి ఆలోచించడమో చేస్తున్నారు. సాధారణంగా, ఇప్పటికే కొవిడ్కు గురైన వారితో పాటు, టీకా తీసుకున్న వారిలోనూ యాంటీబాడీస్ తయారవుతాయి. కానీ, పరీక్ష జరిపినప్పుడు కొందరిలో యాంటీబాడీస్ తక్కువ స్థాయిలో కనిపిస్తాయి. దీంతో ఆందోళనకు గురవుతారు. తగినన్ని యాంటీబాడీస్ లేవన్న కారణంగా బూస్టర్ డోస్ తీసుకోవడం సరికాదు. కొంతమందిలో యాంటీబాడీస్ మెమరీ సెల్స్కి వెళ్లిపోతాయి. అలాంటి వారిలో వైరస్ ఎటాక్ అయితే, వెంటనే మెమరీ సెల్స్ యాక్టివ్ అయిపోయి యాంటీబాడీస్స్థాయి పెరిగిపోవచ్చు.