చే ఓ చైతన్యం, చే ఓ ప్రభంజనం. తలపైకెత్తి చూస్తున్న చురుకైన కళ్ళు, నిర్లక్ష్యంగా వదిలేసిన జుట్టు, సన్నగా పెరిగిన గడ్డం, నలిగిన దుస్తులు, పెదాలపై సిగార్, తలపై క్యాప్తో విప్లవ స్ఫూర్తిని నింపే రూపం, సడలని ఆత్మ విశ్వాసం, చెరగని వ్యక్తిత్వంతో అలుపెరగకుండా చేసిన పయనం చే జీవితం. మరి ఒక సామాన్య జీవితాన్ని ఆనందంగా గడుపుదాం అనుకున్న అయన ఒక విప్లవ జ్యోతిగా ఎలా ఎదిగారు? అయన హత్యకి దారి తీసిన పరిస్థితులు ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈయన అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. హింసాత్మక విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు.1954 లో గౌటెమాల దేశంలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం పతనం కావడంతో మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని హింసాత్మక విప్లవ దృక్పథం మరింత బలపడింది.
మెక్సికో లో ఫీడెల్ కాస్ట్రో నాయకత్వం లో అచటికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్గా, మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయంలోనే ఇతను చే గా వ్యవహ రితమయ్యాడు. గువేరాఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారు లందరూ అతన్ని చే అని పిలువనారంభించారు. అలా ఆ పేరు స్థిర పడిపోయింది.
ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు గువేరా పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్గా పని చేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే గువేరా క్యూబా సామ్యవాద దేశంగా మారటానికి దోహదపడ్డాడు.
గెరిల్లా యుద్దం గురించి వివరించే తన రచనలలో వర్థమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు. పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టిన గువేరా 1965 లో క్యూబాలో తన అతున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమ య్యాడు. కొద్దిమంది అనుచరు లతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంత కాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగు బాటుకు ప్రయత్నించి విఫలుడయ్యాడు.
క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తరువాత 1959లో చే నిర్వహించిన బాధ్యతల్లో అతి ముఖ్యమైనది క్యూబా తరఫు రాయబారిగా అనేక దేశాల్లో పర్యటించడం. జులై 1న చే, అతని సహచరులు భారతదేశం చేరారు. ముందుగా ప్రధాని నెహ్రూను కలుసుకున్నారు. జామా మసీదును, గాంధీ సమాధినీ సందర్శించారు. గాంధీ తన చిన్ననాటి ఆరాధ్యనాయకుడని సహచరులతో చెబుతూ లాటిన్ అమెరికాలో మాత్రం ఈ అహింసా సిద్ధాంతాలతో లాభం లేదు. మనం మరింత రాటుదేలాలా అని వ్యాఖ్యానించాడు చే గువేరా.
బొలీవియాలో చే గువేరా విప్లవోద్యమ యత్నాలు చేయడం అమెరికా నిఘా సంస్థ సీఐఏ కు ఆందోళన కలిగించింది. పురిట్లోనే విప్లవోద్యమాన్ని ఖతం చేసేందు కు అన్ని రకాల ప్రయత్నాలూ చేసింది. చే గువేరాను వెంటాడి వేటాడేందుకు ప్రత్యక్షం గా రంగం లోకి దిగింది. బొలీవియా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిం చింది. అక్టోబర్ 8న గువేరా ప్రభుత్వ దళాలకు దొరికిపోయాడు. 9వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు చే గువేరాను అత్యంత దారుణంగా హతమార్చారు. సాక్ష్యం కోసం అన్నట్లుగా ఆ మరుసటి రోజున చే భౌతిక కాయం నుంచి చేతు లను మణికట్టు దాకా తొలగించి భద్రపరి చారు. భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఇవన్నీ సీఐఏ కనుసన్నల్లోనే జరగడం గమనార్హం. 1995 వరకూ ఖననం ఎక్కడ జరిగిందీ బయటి ప్రపంచానికి వెల్లడి కాలేదు. హత్య జరిగిన 28 ఏళ్ళ తరువాత బొలీవియా సైనికాధికారి ఒకరు తను రిటైర్ అయ్యాక వాస్తవాలు వెల్లడించాడు. దీంతో క్యూబా ప్రభుత్వం చే గువేరా, ఆయన సహచరుల అస్తిపంజరాలను క్యూబాకు తరలించి అక్కడ ఖననం చేసిం ది. జ్ఞాపికలు నిర్మించారు.
చే గువేరా హత్యకు కారణమైన వారంతా ఆ తరువాతి 15 ఏళ్ళలో ఏదోరకమైన దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది అసహజ మరణాలకు గురయ్యారు. మరికొందరు రోడ్డుప్రమాదాల్లో మరణించారు. కొంతమందిని గెరిల్లాలు హతమార్చారు. ఈ హత్యల వెనుక క్యూబా హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ అందుకు సాక్ష్యాధారాలేవీ లభించలేదు. చే గువేరా తాను చనిపోయి కూడా సీఐఏ ను వణికించాడు. చే ను దుర్మార్గుడిగా చిత్రీకరించేందుకు సీఐఏ పలు విధాలుగా ప్రయత్నించింది. నకిలీ డైరీలను చలామణిలోకి తెచ్చేందుకూ విఫలయత్నం చేసింది.
చే గువేరా నిరాడంబరత్వం ఎలా ఉండేది అంటే, ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్నా లంచ్టైమ్లో సాధారణ కార్మికులతో పాటుగా చే కూడా ఓ అల్యూమినియం పళ్ళెం పుచ్చుకొని క్యాంటీన్ ముందు క్యూలో నిలబడి తన కోటా భోజనం తెచ్చుకునే వాడు. ఆదివారాల్లో స్వచ్ఛంద శ్రమదానం కార్యక్రమాల్లో పోటీ పడి పని చేసేవాడు. ఇన్హేలర్ వాడుకునేందుకు కూడా సమయం తీసుకోకుండా బస్తాలు మోసేవాడు. క్యూబా ప్రభుత్వంలో, సమాజంలో తనకెంత ప్రముఖ స్థానం ఏర్పడిందో చే గువెరాకు తెలుసు. తన ఇంత కాలమూ ఏర్పరచుకున్న విలువలను, నిరాడంబరత్వాన్ని ఈ హోదాలు ఆక్రమించ కుండా అడుగడుగునా జాగ్రత్త వహించేవాడ తడు. కనీసావసరాలకు సరిపడే వేతనం తప్ప అదనంగా ఏ సౌకర్యాలకూ అతని జీవితంలో చోటు లేదు. వ్యక్తిగత వ్యవహారాల మీద బ యటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అతని జేబు లో కాఫీ తాగడానికైనా డబ్బులుండేవి కావంటా.
ప్రపంచంలో ఎక్కడ పోరాటం జరుగుతుందో అక్కడ సమాజాన్ని మరింత ఎరుపెక్కించడం కోసం పోరాడి చనిపోవడమే అరుదైన గౌరవం అని చెప్పి ఇప్పటికి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తూ విప్లవానికి మరణం అడ్డు కాదని చాటిచెప్పిన విప్లవోద్యమస్ఫూర్తి చే గువేరా.