ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే కలుగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం . సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసిన వాడు, రామ లక్ష్మణులు నీకు మిత్రులే కాని, వాలి పంపగా వచ్చినవారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగచేసినవాడు, నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు.
స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ,అరటి తోటలలోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. అసలు తమలపాకుల మాలను హనుమంతుడికి ఎందుకు వేస్తారో చూద్దాం.
సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. దాంతో రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో సహాయపడుతూ ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయం రామునితో చెప్పాలని లంక నుండి బయలుదేరతాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించాలని ఆశిస్తుంది.
అయితే అశోకవనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దానితో పుష్పాలకు బదులు తమలపాకును కోసి, ఆంజనేయ స్వామి తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే తమలపాకు ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనది. అది మాత్రమే కాదు, సీతమ్మ వద్ద నుండి తిరిగ వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు హనుమంతుడు. అది విన్న వానరులకు విషయం అర్దమైపోతుంది. హనుమంతుడు కచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయికళ్లతో ఎదురుచూస్తారు.
అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లనే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడు. ఆంజనేయ స్వామి జ్యోతి స్వరూపుడు. ఆయనను పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అవరోధాలు తొలగిపోతాయి.
అందుకే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకు మాలను సమర్పిస్తే మనోబీష్టాలు నెరవేరుతాయి. అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణ చేస్తే సర్వసంపదలూ, సుఖసంతోషాలు కలుగుతాయి.