మన దేశంలో బంగారు ఆలయాలు రెండు ఉన్నాయి. ఒకటి ఉత్తరాదిలో ఉన్న అమృత్ సర్ లో ఉండగా మరి ఒకటి దక్షిణాన గల శ్రీపురం. పూర్తిగా బంగారం తో తయారుచేయబడిన ఈ ఆలయం లో విశేషాలు ఏంటి? ఈ ఆలయం నిర్మాణం ఎలా ఉంటుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం, శ్రీపురంలో లో శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణదేవాలయం ఉంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలూ శిల్పాలను మొదట రాగి తాపడం చేశారు. ఆ తరవాత దానిపై బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి, శిల్పాలను తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్తోనే రూపొందించి, బంగారు తొడుగుతో అలంకరించారు. మూలస్థానంలో వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణకవచాలు, కిరీటంతో స్వర్ణతామరపై ఆసీనమై మహాలక్ష్మి దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి, సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మిగిలిన ఆలయాల్లోలాగా దర్శనం విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులూ విభాగాలూ లేవు. అందరూ క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. తారతమ్యాలు లేని సమానత్వాన్ని ఇక్కడ పాటిస్తారు. శ్రీపురం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ శ్ర్రీచక్రం. ఆలయ ప్రాంగణ మధ్యభాగంలో నక్షత్రాకారంలోని చక్రం మొత్తం పొడవు 1.8 కిలోమీటర్లు. వెలుపల నుండి ఆలయంలోకి వెళ్లాలంటే శ్రీచక్రం అంచుల వెంబడి వెళ్లాలి. ఈ మార్గం పొడవునా రెండు వైపులా ఉండే గోడలపై భగవద్గీత, ఖురాన్, బైబిలులోని ప్రవచనాలను రాశారు. వీటన్నింటినీ చదవడం వల్ల భక్తులు తమ అజ్ఞానపు ఆలోచనలను వీడి, జ్ఞానసుగంధంతో బయటకు వెళతారని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తిఅమ్మ ఉద్దేశం. బంగారు ఆలయం నిర్మాణానికి సుమారు రూ. 300 కోట్లు వెచ్చించారు. సుమారు 1500 కిలోగ్రాముల బంగరాన్ని ఉపయోగించి ఆలయ వైభవానికి వెన్నెతెచ్చారు. అయితే శ్రీపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణీ దేవాలయం వ్యయపరంగా,విస్తీర్ణం పరంగా అమృత్సర్లోని స్వర్ణదేవాలయం కన్నా పెద్దది. ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు పెట్టారు. ఈ వ్యయంతో పోలిస్తే బంగారం కొనేందుకు పెట్టిన ఖర్చు తక్కువ.ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం, కృత్రిమ ఫౌంటెన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. మానవుడు తన ఏడు జన్మల్నీ దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో విశేషం ఏంటనే ఇక్కడ ఎలాంటి తారతమ్యాలు ఉండవు. ప్రతి భక్తుడు క్యూలో ఉండి దర్శనం చేసుకోవాల్సిందే.