ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణేతిహాసాల్లోనూ ఈ విషయం మనకు స్పష్టమౌతుంది. కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం. అంతే కాక మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్కృతిలో భాగమే విష్ణువు అత్యంత ప్రసిధ్ద అవరోహణల్ని సమిష్టిగా వతారలని అంటారు.
అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం. మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం
బ్రహ్మ అవతారము:
దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
వరాహ అవతారము:
రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేసాడు.
నారద అవతారము:
దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేసాడు.
నర నారాయణ అవతారము:
ధర్ముని పత్నికి నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టాన పూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
కపిల అవతారము:
నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునికి తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
దత్తాత్రేయ అవతారము:
భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకు ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు “అన్వీక్షకి” అని పేరు.
యజ్ఞుడు యజ్ఞ అవతారము:
భగవంతుడు రుచి మహర్షికి యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
ఋషభ అవతారము:
భగవానుడు అగ్నీధ్రుని కొడుకు మేరు దేవికి జన్మించి విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
పృధు అవతారము:
పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఔషధాలను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
మత్స్య అవతారము:
చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, ప్రజలను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
కూర్మ అవతారము:
దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
ధన్వంతరీ అవతారము:
అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
మోహినీ అవతారము:
జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రమే అందేలా చేశాడు.
నృసింహ అవతారము:
లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాపాడటానికి శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి ఉద్భవించాడు.
వామన అవతారము:
కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
పరశురామ అవతారము:
మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కసార్లు దండెత్తి వారిని దండించాడు.
వ్యాస అవతారము:
కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.
రామ అవతారము:
పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం చేసాడు.
బలరామ అవతారము, కృష్ణ అవతారము:
బలరామ కృష్ణులుగా ఒకేసారి అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.
బుద్ధ అవతారము:
కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి ప్రజలకు జ్ఞానాన్ని ఉపదేశించాడు.
కల్కి అవతారము:
కలియుగాంతంలో రాజులు ధర్మాన్ని పూర్తిగా వదిలిపెట్టి వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి పేరుతో జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.