దేశ వ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా. చెడుపై మంచి విజయం సాధించిన రోజుకు సాక్ష్యంగా విజయదశమిని జరుపుకుంటారు. ఆదిశక్తి నవదుర్గ అవతారంలో మహిషాసురుని అంతమొందించిన సందర్బంగా దేశమంతా విజయదశమిని జరుపుకుంటారు. ఈ రోజే.. రాముడు రావణాసురుడిని అంతమొందించి.. రావణుడి చెర నుంచి సీతను విడిపించాడని అంటారు. ఇదే రోజున పాండవులు.. కౌరవుల మీద యుద్ధం గెలిచారని చెబుతారు. అందుకే ఈ విజయదశమికి ప్రధాన్యత ఎక్కువ. 9రోజుల పాటు నవరాత్రి వేడుకలు జరిపి.. పదవ రోజు దసరాను జరుపుకుంటారు.
ఇంత ప్రాముఖ్యత గలిగిన ఈ నవరాత్రి రోజుల్లో.. మనలో చాలా మంది తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆహరం విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ మనకు తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. మరి నవరాత్రుల్లో అసలు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నవరాత్రుల సమయంలో వ్రతం ఆచరించేవారు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదు. ఇలా ఎందుకు చేస్తారనే దాని వెనుక సైంటిఫిక్ కారణాలు వున్నాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి శరీర శక్తిని ప్రేరేపిస్తాయి. ఉల్లిపాయలు శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల నవరాత్రి ఉపవాస సమయంలో ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం వుంది. ఇక వెల్లుల్లిని తినడం వల్ల సదరు వ్యక్తి వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోయేలా చేస్తుంది. ఇది కోరికలు గతి తప్పేలా చేస్తుంది కనుక దీన్ని కూడా ముట్టుకోరు. కేవలం భక్తిభావంతో నవరాత్రుల సమయంలో అమ్మవారిని కొలుస్తారు.
ఈ నవరాత్రి వేళల్లో.. జుట్టు కత్తిరించకూడదు. అలా చేస్తే.. దుర్గా దేవికి కోపం తెప్పించినవారమౌతామట. పిల్లలకు కూడా గుండు చేపించడం లాంటివి చేయకూడదు. నవరాత్రి తొమ్మిది రోజులపాటు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అంతేకాదు ఈ నవరాత్రి రోజుల్లో.. నిమ్మకాయని కోయడం కూడా అశుభంగా పరిగణిస్తారు.
దసరా నవరాత్రులకు ఉపవాస దీక్ష చేసే వారు మధ్యాహ్నం సమయాల్లో పడుకోకూడదు. ఉపవాసం చేస్తే ఎవరికైనా కాస్త నీరసంగానే ఉంటుంది. దీంతో మధ్యాహ్నం సమయంలో నిద్రపోవడం లాంటివి చేస్తుంటారు. అయితే.. ఉపవాస దీక్ష చేస్తున్నవాళ్లు.. పగటి పూట నిద్రపోకూడదట. ఒక వేళ నిద్రపోతే ఎంతో కష్టపడి చేసిన ఉపవాస దీక్షకు ఫలితం లేకుండా పోతుంది.
నవరాత్రి రోజుల్లో.. చాలా మంది ఇంట్లో కలశం ఏర్పాటు చేయడం, అఖండ జ్యోతి వెలిగించడం లాంటివి చేస్తారు. వీటిని చేస్తే..చాలా శ్రద్దగా చేయాలి. లేకపోతే అసలు చేయకుండా అయినా ఉండాలి అంతేకానీ.. పేరుకి చేసామంటే చేశామనే విధంగా చేయకూడదు. కలశాన్ని ఏర్పాటు చేసినదగ్గర నుంచి అది కింద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇక అఖండ ద్వీపం విషయానికి వస్తే.. అది ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో అఖండ ద్వీపం వెలిగించినప్పుడు రాత్రి వేళల్లో ఇంటి సభ్యులు ఎవరో ఒకరు నిద్ర పోకుండా ఉండాలి.