మనం తీసుకునే ఆహరం శరీరంలో అవయవాలు సరిగా పనిచేయడానికి ఒక ఇంధనంలా పనిచేస్తుంది. అంటే మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి కలిగి ఉండాలి. పగలు తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో..రాత్రిపూట తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మరుసటి రోజు విజయవంతంగా ప్రారంభించడానికి అవసరమైన శక్తిని రాత్రి భోజనం ఇస్తుంది. కాబట్టి రాత్రి తినే ఆహారాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి.
అయితే మనలో అధిక శాతం మంది రాత్రి పూట భోజనం పట్ల అంతగా శ్రద్ధ చూపించరు. ఇష్టం వచ్చింది తింటారు. పగలంతా పని చేసుకొని రాత్రికి ఫ్రెండ్స్ తోనో, బంధువులతోనో డిన్నర్ కి వెళుతూ ఉంటారు. హోటల్స్, రెస్టారెంట్లు, బయట చిరుతిళ్లు.. బిర్యానీలు, మసాలా పదార్థాలు, స్వీట్లు అంటూ రాత్రి పూట తెగ లాగించేస్తారు. కానీ నిజానికి రాత్రి పూట అంత హెవీగా భోజనం చేయకూడదు. చాలా లైట్గా భోజనం చేయాలి.
శరీరం పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువ విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి రాత్రి పూట మన శరీరానికి చాలా తక్కువ మొత్తంలో శక్తి అవసరం అవుతుంది. అందుకని కొంత ఆహారం మాత్రమే తింటే చాలు. అదే ఆహారం ఎక్కువైతే అందులో శక్తికి పోను మిగిలినదంతా కొవ్వు కింద మారి శరీరంలో నిల్వ ఉంటుంది. ఇది మనకు హాని కలిగిస్తుంది. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులకు కారణమవుతుంది.
రాత్రి పూట ఆహారంలో జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, ఫ్రాజెన్ ఫుడ్, మాంసాహారం, బాగా కొవ్వు ఉన్న పదార్థాలను అస్సలు తినకూడదు. లేదంటే వాటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నవారు ముందు చెప్పిన ఆహారాన్ని రాత్రి పూట అస్సలు తినకూడదు. లేదంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అలర్జీలు వ్యాపిస్తాయి.
రాత్రి పూట ఆహారంలో పెరుగుకు బదులుగా మజ్జిగను తీసుకోవాలి. అదేవిధంగా అన్నంకు బదులుగా చపాతీలను తినాలి. అవి కూడా తగ్గించి తినాలి. లేదంటే ఎక్కువ ఆహారం వల్ల జీర్ణం ఆలస్యమై గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. దీంతోపాటు రాత్రి పూట వీలైనంత వరకు ఉప్పును తగ్గించి తినాలి. లేదంటే మానేయాలి. ఒక వేళ ఉప్పు ఉన్న పదార్థాలను రాత్రి పూట ఎక్కువగా తింటే శరీరంలోకి నీరు ఎక్కువగా వస్తుంది.
ఆకుపచ్చని కూరగాయలను రాత్రి పూట ఎక్కువగా తినాలి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. వీటితోపాటు అల్లం వంటి పదార్థాలను కలుపుకుని తింటే దాంతో శరీరానికి రాత్రి పూట కావల్సిన వేడి అందుతుంది. రాత్రి పూట చక్కెరకు బదులుగా తేనె వాడాలి. చల్లని పాలు తాగరాదు. కొవ్వు తక్కువగా ఉన్న, కొవ్వు తీసిన పాలు తాగవచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి.
ఈ పదార్థాల్లో వేటిని తిన్నా బాగా తక్కువ మొత్తంలో తినాలి. వీలైనంత వరకు కడుపును చాలా వరకు ఖాళీగా ఉంచాలి. దీని వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావు. అంతేకాదు, రాత్రి భోజనం తరువాత కనీసం 3 గంటలు ఆగి నిద్రపోవాలి. దీంతో నిద్ర చక్కగా పట్టడమే కాదు, అధికంగా బరువు పెరగకుండా ఉంటారు. గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక మాంసం జీర్ణం కావడానికి తీసుకునే సమయం చాలా ఎక్కువ. అందుకని రాత్రిపూట మాంసం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మీద భారం పడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు వస్తాయి. అంతే కాదు నిద్ర పాడవుతుంది. కనుక ఎట్టి పరిస్థితి లో రాత్రిపూట మాసం తీసుకోవద్దు. అలానే ఐస్ క్రీమ్ ని కూడా రాత్రిళ్ళు తినకండి. ఐస్ క్రీమ్ లో అధిక చక్కెర శాతం ఉండడం వల్ల నిద్రని దూరం చేస్తుంది. అధిక చక్కెర, జీర్ణం అవడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. కాబట్టి ఐస్ క్రీమ్ కి రాత్రిపూట నో చెప్పండి.
అంతే కాదు క్యాబేజీ, క్యాలిఫ్లవర్ కూడా రాత్రిళ్ళు తీసుకోకూడదు. వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణం అవడానికి టైమ్ తీసుకుంటుంది. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల నిద్ర దూరం అవుతుంది. అలానే రాత్రిళ్ళు కాఫీ టీ కి దూరంగా ఉండండి. కాఫీ లో ఉండే కెఫైన్ బ్లడ్ ప్రజర్ ని ఎక్కువ చేసి ఉత్తేజాన్ని ఇస్తుంది. దీని కారణంగా నిద్ర తొందరగా రాదు. అది తర్వాతి రోజుపై ప్రభావం చూపుతుంది. టమాటా కూడా తీసుకోవద్దు. అధిక శాతం విటమిన్ సి, జీర్ణం కావడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది.
సాధారణంగా, బీట్రూట్ చాలా పోషకాలున్న వెజిటేబుల్. కానీ రాత్రి వేళ దీన్ని తినడం మంచి ఎంపిక కాదు. ఎందుకంటే రాత్రిపూట బీట్రూట్ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు తక్షణమే పెరుగుతాయి. రాత్రిపూట సిట్రిక్ ఆమ్లాలు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను నివారించడం వల్ల మీ ప్రేగు కదలికలకు మంచిది. ముఖ్యంగా నారింజ రసంలో పండు కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి, రాత్రిపూట తాగడం మానుకోవడం మంచిది. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.