ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొనే సాధారణ సమస్యలలో చుండ్రు ఒక ముఖ్యమైన సమస్యగా చెప్పవచ్చు. చుండ్రు ఒకప్పుడు చలికాలం మాత్రమే వచ్చే సమస్య. ఇప్పుడు కాలాలు, వాతావరణం సంబంధం లేకుండా వచ్చేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీని వలన ఇబ్బంది పడుతున్నారు. ఆహారంలో గణనీయమైన మార్పులు, తరచు ప్రయాణాలు చేయడం, నీటి మార్పు, వాతావరణ మార్పు మొదలైనవి ఇప్పుడు అందరి జీవితంలో తప్పనిసరి అయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో జుట్టుని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవటానికి ఖచ్చితంగా కొంత సమయం కేటాయించాలి.
చుండ్రు అనేది ప్రాణాంతక వ్యాధి కాదు, కాని చాలా చిరాకు కలిగించే సమస్య. కొందరిలో ఈ సమస్య వారి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుంది. కొందరు చుండ్రు కోసం అనేక రకాల షాంపూలు వాడినా పెద్దగా ఫలితం మాత్రం ఉండదు. దీనితో గుండు చేయించడం మేలు అని చెప్పి చేయించుకునే వారు కూడా ఉన్నారు. యువతలో ఎక్కువగా ఉండే చుండ్రు సమస్యతో వ్యాధులు కూడా వస్తాయని… అవి దీర్ఘకాలం ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.
చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనబడే హానిలేని సూక్ష్మజీవి. ఇది అందరిలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇది చుండ్రు రావటానికి దోహదపడుతుంది. చుండ్రు రావటానికి కారణం తలలో అధికంగా ఉండే నూనె, మృతచర్మ కణాలు. వీటిని ఆహారంగా తీసుకుని ఈస్టు వృద్ధి చెంది చుండ్రుకి దారి తీస్తుంది. దీని మూలంగా మృత చర్మ కణాలు ఎక్కువై తల నిండా పొట్టు లాగా కనపడుతుంది. దీనినే చుండ్రు అంటారు.
మరి దీనికి పరిష్కారం ఏంటి…? డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా సమస్య మాత్రం తీరే అవకాశాలు కనపడటం లేదు. అయితే మన చేతిలో ఉన్న వాటి ద్వారానే దీనికి పరిష్కారం చూపించవచ్చునని కొందరు అంటున్నారు. ఇందుకు కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు చుండ్రు సమస్య నుంచి బయట పడే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు.
తలస్నానం చేసే ముందు ఆ నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి వాటితో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇది ఒక్కసారి చేసి వదిలేయకుండా వారానికి ఒక్కసారి అయినా ఇలా చేస్తూ ఉంటే చుండ్రుని నియంత్రిచవచ్చు.
యాపిల్ సిడార్ వెనిగర్ కి యాంటీఫంగల్ గుణాలు ఉంటాయి. దీన్ని నేరుగా అప్లై చేయవచ్చు, పదార్థాలతో కలిపి తినవచ్చు. ఇది శరీరంలో పిహెచ్ బ్యాలెన్స్ సరిచేసి, వెంట్రుకల కుదుళ్లను బలపరచడం ద్వారా చుండ్రు తొలగిపోయేలా చేస్తుంది.
మెంతులు జుట్టుకి ఎంతో పోషణని అందిస్తాయి. ఒక అర కప్పు మెంతుల్ని రాత్రంతా పెరుగు లేదా మజ్జిగలో నానపెట్టాలి. ప్రొద్దున్నే వాటిని మెత్తగా రుబ్బి తలకి పెట్టుకుని ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి వేయాలి. షాంపూ రెండు రోజుల వరకు వాడకూడదు. ఇలా చేయటం వలన జుట్టుకి పోషణ లభిస్తుంది. జుట్టు మృదువుగా ఉంటది మరియు చుండ్రు తగ్గుతుంది. రెండు వారాలకి ఒకసారి లేదా నెలకి ఒకసారి ఇలా చేసుకోవచ్చు.
కుదుళ్ల దగ్గర సహజసిద్ధమైన తేమ పోకుండా నిలిచి ఉండాలంటే తడిచిన కుదుళ్లకు బేకింగ్ సోడా పట్టించి మర్దన చేయాలి. కొద్ది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
పుల్లటి పెరుగు తలకి పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. దీని వలన చుండ్రు సమస్య తగ్గి జుట్టు మృదువుగా ఉంటుంది.
కలబంద పొడిబారిన కుదుళ్లకు మాయిశ్చరైజర్లా పని చేస్తుంది. దీనిలోని యాంటీసెప్టిక్ గుణాలు చుండ్రును పెంచే బ్యాక్టీరియాను చంపేస్తాయి.
క్రోడిగుడ్డు జుట్టుకి పెట్టుకోవటం వలన వెంట్రుకలు మృదువుగా అవుతాయి మరియు జుట్టుకి కావలసిన పోషణ దొరుకుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది. వారానికి ఒక్కసారి ఇలా చెయ్యటం మంచిది.
యాస్ర్పిన్ లో అసిటైల్సిలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను చంపి, మృత చర్మాన్ని వదిలిస్తుంది. రెండు మాత్రలు పొడిచేసి, షాంపూతో కలిపి తల రుద్దుకుని స్నానం చేయాలి.