ఒకప్పుడు ఆడవాళ్లు పాదాల మీద పెద్దగా శ్రద్ధ చూపించేవారు కాదేమో గాని ఇప్పటి మహిళలు బ్యూటీ మైంటైనెన్స్ లో భాగంగా పాదాల రక్షణ కోసం కూడా ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అయితే కొంతమందిలో మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాదాల సమస్యలు కనిపిస్తూనే ఉంటాయి.
చెప్పులు పాదాలకు అనుకున్నంతగా రక్షననివ్వలేక పోవటం వల్ల పాదాలు రంగు మారటం, పగలడం వంటి మార్పులకు లోనవుతూ ఉంటాయి. అందుకే పాదాల ఆరోగ్యం, పరిరక్షణ మీద ప్రత్యెక శ్రద్ధ అవసరం. ఈ ఇబ్బందులన్నిటికీ పెడిక్యూర్ చక్కని ప్రత్యామ్నాయం.
పెడిక్యూర్ అనగానే దీనిని పార్లర్ లో మాత్రమే చేయించుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి పెడిక్యూర్ అంటే మర్దన ద్వారా పాదాలను కాపాడుకోవటం. రోజంతా పని చేసి అలసి పోయిన పాదాలకు సున్నితమైన మసాజ్ తో ఉపశమనాన్ని కలిగించటమే పెడిక్యూర్.
ప్యూమిస్ స్టోన్, మసాజ్ క్రీమ్, నెయిల్ బ్రష్, నెయిల్ క్లిప్పర్స్, నెయిల్ వార్నిష్, ఒక చిన్న టబ్ సమకూర్చుకుంటే ఎవరికీ వారు ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. పెడిక్యూర్ లో భాగంగా చేసే మసాజ్, టోనింగ్ వల్ల పాదాలకు బలం చేకూరటమే గాక రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. దీనిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా నైల్ పోలిష్ ఉంటే తొలగించాలి. తర్వాత ఒక బకెట్ లో గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో 5 స్పూన్స్ నిమ్మరసం, చిటికెడు ఉప్పు, సుగంధ నూనె, తేలికపాటి షాంపూ వేసి కలిపి అందులో అరగంట పాటు పాదాలను పెట్టి కూర్చోవాలి. పాదాలు నానిన తర్వాత ప్యూమిస్ స్టోన్ లేదా బాగా పట్టించిన సున్నిపిండితో పాదాలను రుద్ది శుభ్రం చేయాలి.
తర్వాత గోళ్లను సమంగా కట్ చేసుకుని, ఏదయినా మట్టి ఉంటే శుభ్రం చేసుకోవాలి. తర్వాత నూనె లేదా క్రీముతో గోళ్లను, పాదాలను మర్దనా చేయటం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది. వీటితోపాటు రోజూ స్నానం చేసిన తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ను రాసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంయి.