సీజన్ మారినప్పుడల్లా చాలా మందికి ఆరోగ్యసమస్యలు తలెత్తుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ఆయా రుతువుల్లో వచ్చే పండ్లను తినాల్సి ఉంటుంది. శీతాకాలం మొదలయ్యే సరికి కమలాఫలాల సీజన్ మొదలవుతుంది. అయితే చాలామంది జలుబు చేస్తుందేమోనని కమలాఫలానికి దూరంగా ఉంటారు. ఇది నిజమేనా? అపోహనా? అసలు కమలాఫలాల వల్ల మనకు ఎలాంటి మేలు జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కమలాఫలాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని వైద్యులు చెబుతారు. ముఖ్యంగా ఇందులో సి విటమిన్ ఉంటుంది. అధిక పీచు పదార్దం ఉంటుంది. దీని వల్ల బరువు పెరగరు, అలాగే నీరసం అనే సమస్య ఉండదు.
జలుబు, జ్వరాలకు కమలా పండ్లు మంచి ఔషదం. ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడితే వారు ఈ కమలాలు తీసుకోవచ్చు. పిల్లలకు తరచూ జలుబు చేస్తున్నా పెద్దలకు కూడా సీజన్ లో జలుబు వస్తున్నా కమలాలు ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి జలుబు రాదు.
ఇక కడుపుతో ఉన్న గర్భిణీలు వీటిని తీసుకోవడం మంచిది. గర్భస్థ శిశువు మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ కమలాల్లో ఉంటుంది. ఇవి తింటే గుండె జబ్బులు రావు. బీపీ సమస్య ఉండదు. చక్కెర స్ధాయిలు అదుపులో ఉంటాయి.
ఇవి తింటే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎముకలు బలంగా మారడానికి తగిన కాల్షియం అందుతుంది. అంతేకాదు కిడ్నీలో రాళ్ల సమస్యలు రాకుండా చూస్తాయి. అల్సర్లు రాకుండా కాపాడతాయి.
వయసు పెరిగే కొద్దీ కంటి సమస్యలు రావడం, కంటి చూపు మందగించడం సహజమే. ఆహారంలో కెరొటనాయిడ్స్, విటమిన్ ఎ ఉంటే.. ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కళ్ల ఆరోగ్యానికి విటమిన్ ఎ, కెరొటినాయిడ్ అవసరం చాలా ఉంది. ఈ రెండూ కమలాఫలంలో పుష్కలంగా ఉంటాయి.