రావణుణ్ణి చంపిన దోషం పోగొట్టుకోవడానికి సాక్షాత్తు శ్రీరాముడే దోష నివారణ చేసుకోవలసి వచ్చింది. బ్రహ్మ హత్యా పాతకం రాముణ్ణి సైతం వదలలేదంటే రావణుడి పుట్టుక, రావణ బ్రహ్మ వంశం ప్రాముఖ్యత తెలుస్తుంది. అటువంటి రావణుని జన్మ రహస్యం తెలుసుకుందాం.
భాగవత పురాణం ప్రకారం, ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకోగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు.
ఈ విధంగా జయవిజయులు
- కృతయుగము:లో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు
- త్రేతాయుగము:లో రావణాసురుడు, కుంభకర్ణుడు
- ద్వాపరయుగము: మందు శిశుపాలుడు, దంతవక్ర్తుడు
- ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణ, కుంభకర్ణులనే అన్నదమ్ములు.
బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వ వసు బ్రహ్మకి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మించాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలికి జన్మించిన పుత్రులకు రాజ్య సింహాసనాన్ని అధిష్టించే అర్హత లేకపోవడంతో, సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనుమడు కావాలన్న కోరికతో అందరు రాకుమారులను అంగీకరించకుండా మహా తపస్వి అయిన విశ్వ వసు బ్రహ్మకి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి, తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యాకాలంలో విశ్వ వసు బ్రహ్మ మహర్షి తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయన వద్దకు వెళ్ళింది.
తపోశక్తితో తన కోరిక తెలుసుకోమని అంటుంది. విశ్వ వసు బ్రహ్మ విషయం తెలుసుకొని అసుర సంధ్యాకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతాడు. కాని ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు.
రావణాసురుడు చిన్నతనం నుండి సాత్విక స్వభావం లేకుండా తామస స్వభావం కలిగి ఉండేవాడు. ఏకసంథాగ్రాహిగా ఉండేవాడు. వేదవిద్యలు తన తండ్రి విశ్వ వసు బ్రహ్మ నుండి నేర్చుకొని గొప్ప విద్వాంసుడయ్యాడు. తన తాత సుమాలి వద్ద నుండి రాజ్యపాలనా విషయాలు, దైత్యకృత్యాలు నేర్చుకుంటాడు.