కొంతమంది పూజలోని అంత్రరార్థాన్ని తెలుసుకోకుండా, అదొక తంతులాగా భావిస్తుంటారు. పూజను ప్రారంభించేటప్పుడు ముందుగా ధ్యానంతో ప్రారంభిస్తాం. ధ్యానం ద్వారా భక్తునికి, తానెవరో, తను ఇక్కడకు ఎందుకు వచ్చాడో , ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందోనన్న విషయన్ని తెలుసుకుంటాడు. అయితే పూజలు చెయ్యడానికి అనువైన సమయం ఏమిటో తెలుసుకుందాం.
పూజలకు, అర్చనలకు, ఉపాసనలకు సంధ్యా సమయం ఎంతో ఉత్తమమైందని నిర్ణయించారు. త్రిసంధ్యలు కూడా అనుకూలమైనది.
1. ప్రాత: సంధ్య
2. మధ్యాహ్న సంధ్య
3. సాయం సంధ్య అని మూడు రకాలుగా విభజించారు.
- ప్రాత:సంధ్య : సూర్యోదయానికి ముందు ఘడియ ముందు.
- మధ్యాహ్న సంధ్య :మిట్ట మధ్యాహ్నం ఒకటిన్నర ఘడియల ముందు.
- సాయం సంధ్య : సూర్యాస్తమయానికి 3 ఘడియల ముందు
అన్ని సంధ్యలలో బ్రహ్మ ముహూర్త కాలం ప్రశస్తమైనది. బ్రహ్మముహూర్తమంటే తెల్లవారుఝామున 3.30 గంటల నుండి 4.45 గంటల మధ్య సమయమని పెద్దల వాక్కు. బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రకృతి సత్త్వ గుణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఈ సమయం జపాలకు, పూజలకు చాల అనుకూలమైన సమయమని చెప్పబడింది. ఇక, ఘడియ కాలాన్ని ఒకరోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు లెక్కగడతారు.
ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటిరోజు సూర్యోదయం వరకు 60 ఘడియలకాలం. అంటే 30 ఘడియలు పగలైతే, మిగతా 30 ఘడియలు రాత్రన్నమాట. సూర్యోదయం నుండి 55 ఘడియలు అనంతరపు 5 ఘడియల కాలాన్ని ఉష:కాలమని, 57 ఘడియలు దాటిన తరువాత మూడు ఘడియల కాలాన్ని అరుణోదయకాలమని అంటారు. 58 ఘడియలు దాటిన తరువాత 2 ఘడియల కాలన్ని ప్రాత:కాలమని అంటారు. ఆ ప్రాత:కాలం తరువాతే సూర్యోదయం.
ఇలా పరిశీలించినపుడు 55 వ ఘడియ నుంచి 58 ఘడియల మధ్యకాలం పూజలు, జపాలకు , ధ్యానాలకు ప్రశస్తమైన సమయం గా చెప్పబడుతోంది.