మనం అధికంగా వాడే పండ్లలో అరటిపండు అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇది రుచితో పాటు రకరకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. క్రీడాకారులు, లేక అధికంగా శ్రమించేవారు కచ్చితంగా అరటిపండును తింటారు. క్రికెటర్లు, ఫుట్బాల్ ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ సమయంలో అరటి పండ్లు తింటూ కనిపిస్తారు. మిగతా పండ్లతో పోలిస్తే అరటికి కాస్త ధర తక్కువ ఉండడంతో అందరూ ఈ పండును తినడానికి ఆసక్తి చూపిస్తారు.
ప్రతిరోజూ అరటి తింటే రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. ఎర్రరక్తకణాలో ఇనుము శాతాన్ని పెంచి రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. ఎర్రరక్తకణాలు పెరగడంతో పాటు ఐరన్ను పెంపొందించి శరీరానికి రక్త ప్రసరణ సజావుగా జరుపుతుంది. అయితే అరటితో ఆరోగ్యమే కాదు అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్యం కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అరటిని ఎక్కువగా గ్రహించడం వలన మన శరీరం పోషకాలను సరిగా గ్రహించలేదు.
శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలి అంటే పోషకాలు అవసరం. అందువల్ల అరటి పండు మితంగా తినాలి. అరటి పండులో పిండి పదార్థాలు అధికంగా ఉండడం వలన ఎక్కువగా తింటే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అరటి పండు లోని పిండి పదార్థాలు తొందరగా జీర్ణం కాక ఆ ప్రభావం జీర్ణాశయం మీద పడుతుంది. అంతేకాక అరటి పండు లో ఉండే పెక్టిన్ అనబడే పీచు పదార్థం పేగుల్లోకి నీటిని ఎక్కువగా శోషించుకుంటుంది. అందువల్ల అరటి పండును ఎక్కువగా తింటే పేగుల్లో ఆహరం, మలం కదలికలు సరిగా లేక మలబద్దకం సమస్య వస్తుంది.
అరటి పండును ఎక్కువగా తింటే అరటి పండులో ఉండే పిండి పదార్థాలు బరువు పెరిగేలా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గాలని అనుకునే వారు రోజుకు రెండు అరటి పండ్లని మించి తీసుకోకూడదు. అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ నిద్ర వచ్చేలా చేస్తుంది. ఈ క్రమంలో అరటి పండ్లను తింటే నిద్ర బాగా వస్తుంది. మెదడు చురుకుగా పని చేయలేదు. బద్ధకంగా ఉంటారు.