ప్రపంచమంతా కరోనా విజృంభిస్తున్న తరుణంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఏకైక మార్గం మాస్క్ ఒక్కటే. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మాస్కె మెరుగైన అస్త్రమని నిపుణులు కూడా చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. అయితే, దీనిపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాస్క్లు అతిగా వాడటం వల్ల కార్బన్డయాక్సైడ్ స్థాయులు పెరిగి, ఊపిరితిత్తుల సమస్యకు దారితీస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే, మాస్క్ల వినియోగం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని యూనివర్సిటీ ఆఫ్ మియామీ అధ్యయనం స్పష్టం చేసింది. మాస్క్లు ధరించడం వల్ల ఆరోగ్యవంతుల్లో ఆక్సిజన్, కార్బన్డయాక్సైడ్ స్థాయుల్లో మార్పులు జరిగి అనారోగ్యానికి గురవుతున్నారనే వార్తల్లో నిజం లేదని తెలిపింది.
అయితే అందరిలోనూ అలా జరగకపోవచ్చని ముఖ్యంగా క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డీసీజ్ తో బాధపడేవారిలో ఈ సమస్య ఎదురుకావొచ్చని పేర్కొంది. ఎందుకంటే సీఓపీడీ సమస్య ఉన్న వ్యక్తులు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. మాస్క్ ధరించడం వల్ల అతి తక్కువ మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది కూడా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి ఇంకాస్త ఎక్కువగా ఉండవచ్చు.
మాస్క్ బిగుతుగా ధరించడం, వేగంగా నడవడం వల్ల శ్వాస ఆడక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే, సౌకర్యవంతమైన, గాలి పీల్చుకునే వీలున్న మాస్క్లు ధరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. కరోనాకు అడ్డుకట్టవేయడంలో ధరించడం తప్పనిసరి కానీ ఇతరులకు దూరంగా ఉన్నప్పుడు మాస్క్ను తీసేయవచ్చని, సర్జికల్ మాస్క్లు ధరించలేని వారు రెండు పొరలతో కూడిన క్లాత్ మాస్క్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు.