పురాణాల ప్రకారం నరసింహస్వామి తేత్రాయుగంలో ఐదు రూపాల్లో సాక్షాత్కారించాడు. అవి జ్వాలా నరసింహుడు, యోగ నారసింహుడు, గండ బేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మి నారసింహ రూపాల్లో యాదమహర్షికి దర్శనం ఇచ్చాడు. అయితే ఎక్కువగా నరసింహస్వామి ఆలయాలు కొండప్రాంతంలోనే ఉంటాయి. మరి పంచముఖ ఉగ్ర నరసింహస్వామి దర్శనమిచ్చే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో నర్శింపల్లి అనే గ్రామంలో శ్రీ పంచముఖ నరసింహస్వామి ఆలయం ఉంది. అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని నందరాజు అనే మహారాజు నిర్మించినట్లుగా తెలియుచున్నది. ఈ ఆలయం ఒక కొండ గుహలో ఉండగా, ఒక పెద్ద కొండరాయి పైకి లేచి ముందుకు వంగినట్లుగా ఉండటం వలన ఈ గుహాలయం అనేది ఏర్పడినది. అయితే ఈ పెద్దరాయి ఆసరా చేసుకొనే గర్బగుడిని నిర్మించారు.
ఈ ఆలయం పైకప్పుగా ఉన్న పెద్దబండపై బయటివైపు ఆకాశం చూస్తూ 16 చేతుల పంచముఖ ఉగ్ర నరసింహస్వామి వెలసి ఉన్నాడు. ఇక్కడ వెలసిన స్వామివారు 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో, 16 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి హిరణ్యకశిపుని తొడలపై వేసుకొని పొట్టను చీలుస్తున్న భంగిమలో స్వామివారి మూర్తి అద్భుతంగా చెక్కబడినది. అయితే పంచముఖ నరసింహస్వామికి పది చేతులు మాత్రమే ఉండాలి కానీ ఇక్కడి విగ్రహానికి 16 చేతులు ఉండటం విశేషం.
ఈవిధంగా ఇక్కడ వెలసిన స్వామివారికి భక్తులు కోరిన కోరికలు నెరవేరితే వెండి నామాలను, వెండి మీసాలను స్వామివారి హుండీలో వేసే ఆచారం ఉంది. ఇంకా ఈ ఆలయంలో ఉత్సవాలు, జాతరలు జరిగే సమయంలో భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు.