ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పై యుద్ధం మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దాదాపు అన్నీ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తైంది. దాంతో వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాలు మాస్కులకు సెలవు అని ప్రకటించాయి. అది ఎంత తప్పో డెల్టా వేరియంట్ తెలిసొచ్చేలా చేసింది. ఆయా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్నా సరే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దెబ్బకు రెండు డోసుల టీకాలు తీసుకున్నా సరే మాస్కులు పెట్టుకోవాల్సిందేనంటూ ఆదేశాలిచ్చాయి.
అమెరికా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు చూస్తుంటే.. మాస్కులతో సహజీవనం చేయక తప్పదనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్వేవ్ రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారాల్లో ఇండియాలోనూ థర్డ్వేవ్ మొదలవొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్వేవ్కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా డెల్టా వేరియంట్ శక్తివంతంగా మారుతోంది. దీంతో కరోనా వ్యాప్తి వేగంగా పెరగడంతో పాటు డ్యామేజ్ కూడా ఎక్కువగానే చేస్తోంది. ఈ తరుణంలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించడం తప్ప మరో మార్గం లేదు. ముఖ్యంగా మాస్క్ విషయంలో. మాస్క్ ధరించడమే శ్రీరామరక్ష అని వైద్య నిపుణులు మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా ఇంకేం పర్లేదని ధీమా వ్యక్తం చేస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఏం కాదులే అనే నిర్లక్ష్యం పనికిరాదంటున్నారు శాస్త్రవేత్తలు.
డెల్టా వేరియంట్ వైరస్ తప్పకుండా అటాక్ అవుతుందని, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ… డెల్టా వైరస్ నుంచి తప్పించుకోవడం మాత్రం అసాధ్యం అంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేసే వారు డెల్టా వైరస్ వల్ల ఇబ్బందులు తప్పవంటున్నారు. వంద మంది వ్యాక్సిన్ తీసుకుంటే అందులో 66 మందికి మళ్లీ వైరస్ సోకి ఆస్పత్రిలో చేరేంత పరిస్థితులకు దారితీస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్ వేయించుకున్నా సరే మాస్కులు తీయొద్దని అనౌన్స్ చేస్తున్నాయి దేశాలు.
అయితే ప్రాణాపాయం తక్కువగా ఉంటుందన్నారు శాస్త్రవేత్తలు. వ్యాక్సిన్ వల్ల శరీరంలో యాంటీ బాడీస్ పెద్ద ఎత్తున ఉంటాయని వీటి వల్ల వైరస్ వల్ల మరణించే శాతం తక్కువగా ఉంటుందన్నారు. కానీ వ్యాక్సిన్ డోస్ పూర్తి చేసుకోని వారిపై మాత్రం డెల్టా పెను ప్రభావం చూపుతుందంటున్నారు. దీని ప్రభావం ఇప్పటికే యూకే, అమెరికాలో భారీగా ఉందన్నారు. రెండు డోసులు పూర్తి చేసుకున్నప్పటికీ… మాస్క్, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు పాటించిన వారిలో డెల్టా వేరియంట్ ప్రభావం చాలా తక్కువ శాతం ఉందన్నారు.
ఇప్పటికే బ్రిటన్ లో హాస్పిటలైజ్ అయిన 58 శాతం మందిలో 22 శాతం మంది వ్యాక్సినేషన్ డోస్ పూర్తి చేసుకున్న వారే అని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అయితే… ఇది పెద్ద ప్రమాదకర స్థాయిలో లేదన్నారు. కాబట్టి వాక్సిన్ వేసుకున్నా సరే మాస్క్, భౌతికదూరం, శానిటైజర్లు తప్పనిసరిగా మెయిన్టైన్ చేయాల్సిందేనని చెబుతున్నాయి.
పూర్తి స్థాయిలో మాస్కులు ధరించడం ద్వారా వచ్చే ఆగస్టు నాటికి దాదాపు 14 వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని అమెరికాలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో అంచనా వేశారు. ఇక కరోనా సోకిన వారిలో మరో ఆరు నెలల వరకు దాని ప్రభావం ఉంటుందని, అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. తప్పనిసరిగా సరైన పోషకాహారం తీసుకోవాలని, వైద్యుల సలహాలు పాటించాలని సూచిస్తున్నారు.