ప్రస్తుతం జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా పిల్లలు విద్యార్థి దశ నుంచే మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అద్దాలు వాడడం ప్రస్తుత రోజుల్లో సాధారణంగా మారింది. చాలా మంది చిన్నారులు దృష్టి లోపాలతో కంటి అద్దాలను వినియోగిస్తున్నారు. దీనికితోడు సాంకేతిక పరిజ్ఞానం వల్ల కాంతిరేఖలు కంటిపై పడడంతో దృష్టి లోపాలు వస్తున్నాయి.
పిల్లలు టీవీలు, సెల్ఫోన్లు చూడడం, మానసిక ఒత్తిళ్లు తగ్గించుకున్నప్పుడే దృష్టి లోపాన్ని నివారించవచ్చు. కొందరు పిల్లల్లో పుట్టుకతో వచ్చిన శుక్లాలు, దృష్టి మందగించడం, మెల్లకన్ను, పొరలు ఉండడం తదితర సమస్యలు ఉన్నాయి. వంద మంది పిల్లల్లో ఏడుగురికి ఈ లోపం ఉంటోంది. పిల్లలకు చిన్నప్పుడే దృష్టి లోపాలు వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి.
సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు తగిలేలా ఉండకపోవడం, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్లు, ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం.. వంటి కారణాల వల్ల పిల్లలకు చిన్నప్పుడే దృష్టి లోపాలు వస్తున్నాయి. ఇక కొందరు పిల్లల్లో జన్యులోపం వల్ల, వంశ పారంపర్యంగా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాయాలు అయి కంటి చూపును కోల్పోయే అవకాశాలు ఉంటాయి.
ఇలాంటి సందర్బాల్లోనూ దృష్టి లోపాలు వస్తుంటాయి. దృష్టి లోపం అంటే, కంటి చూపు సరిగా కనపడకపోవడం. సాధారణంగా దృష్టి లోపాలు 6 రకాలు.
- హ్రస్వదృష్టి : దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే చూడగలరు, దూరంగా ఉన్న వస్తువులు చూడలేరు.
- దూర దృష్టి: దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే చూడగలరు దగ్గరగా ఉన్న వాటిని చూడలేరు.
- చాత్వరము: దగ్గర మరియు దూరం ఉన్న వాటిని చూడలేరు.
- అసమ దృష్టి: వస్తువులు నిలువు గీతాలు అడ్డు గీతలు గా కనిపిస్తాయి.
- రేచికటి: రాత్రి సమయంలో వస్తువులు చూడలేరు.
- వర్ణ అంధత్వ: రంగులు గుర్తించలేరు
దృష్టి లోపాలు చాలా వరకు పోషకాహార లోపాల వల్లనే వస్తాయి. కనుక అన్ని విటమిన్లు, మినరల్స్ కలిగిన ఆహారాలను వారికి రోజూ ఇవ్వాలి. రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను ఇవ్వాలి. ముఖ్యంగా దృష్టి లోపాలు రాకుండా ఉండేందుకు గాను విటమిన్ ఎ ను అందించాల్సి ఉంటుంది. విటమిన్ ఎ ఎక్కువగా యాపిల్స్, కోడిగుడ్లు, టమాటాలు, నట్స్ వంటి ఆహారాల్లో లభిస్తుంది. అలాగే పాలను కూడా తాగించవచ్చు.
పిల్లలు రోజూ కొంత సేపు అయినా సరే వెలుతురు లేదా ఎండలో గడిపేలా చూడాలి. ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కువగా ఉపయోగించనివ్వకూడదు. అలా యూజ్ చేయాల్సి వస్తే మధ్య మధ్యలో విరామం ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. టీవీలను కూడా ఎక్కువగా చూడనివ్వకూడదు. పిల్లలకి ఒక వస్తువుగానీ, అక్షరాలుగానీ చూపించి వాటిని గుర్తించమని, చదవమని చెప్పాలి.
వారు ఎంత దూరంలో ఉంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నారు అనేది గమనించాలి. దీంతో వారికి దృష్టి లోపం వస్తే ముందుగానే పసిగట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువగా కళ్ళు నలపడం, కళ్ళు ఎర్రగా మారడం, కళ్లనుంచి తరచూ నీరుగారడం ఇలాంటివి ఏవైనా గమనించినట్లయితే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.