త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైనది అని అర్ధం. శివుడు లింగ రూపంలో దర్శనమివ్వగా మన దేశంలో ఎన్నో అద్భుత శివలింగాలు ఉండగా అందులో ఈ ఆలయంలోని శివలింగం కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో ఎక్కడలేని విధంగా నాలుగు ముఖాలు కలిగిన శివలింగం భక్తులకి దర్శనమిస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ శివలింగం ప్రత్యేకత ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ రాష్ట్రం, ఉదయపూర్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏకలింగజి ఆలయం ఉంది. ఇది గొప్ప శైవక్షేత్రం. ఈ ఆలయంలో నాలుగు ముఖాలు గల శివమూర్తి విగ్రహం దర్శనం ఇస్తుంది. గర్భాలయానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలున్నాయి. మధ్యలో నల్లని శిలతో మలచిన శివలింగం కనిపిస్తుంది. ఇది కేవలం లింగాకారంలో కాకా నాలుగు పక్కల నాలుగు ముఖాలున్నాయి. ఈ నాలుగు ముఖాలు బ్రహ్మ, విష్ణు, ,మహేశ్వర, సూర్య అనే నాలుగు పేర్లతో పిలువబడుతున్నాయి.
పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక మహర్షి తపస్సు చేసుకునేవాడు. ఆ ప్రాంతం రాజు రోజు వచ్చి ఏకలింగజి స్వామిని దర్శించి ఆ మహర్షి ఆశీర్వాదాన్ని తీసుకునేవాడు. ఇలా వారి ఆశీర్వాదం వలెనే ఆ రాజు చిత్తోర్ గడ్ ను జయించగలిగాడని నమ్మకం. అందుకే మేవార్ ని పాలించే రాజులందరూ కూడా తమ రాజ్యం అంతాకూడా ఏకలింగాజీ స్వామిదే అని పూజిస్తుండేవారు. ఇది ఇలా ఉంటె, ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ఆదిశంకరుల వారు దర్శించి పూజించారని చెబుతారు.
ఇక ఈ ఆలయంలోని స్వామివారిని ఏకలింగజి అని, అమ్మవారిని ఏకలింగేశ్వరి అని భక్తులు పిలుస్తుంటారు. ఈవిధంగా నాలుగు ముఖాలతో దర్శనమిచ్చే ఈ అద్భుత ఆలయాన్ని దర్శించడం కోసం ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.