మనకు ఎప్పుడైనా మనసు బాలేకపోతే గుడికి వెళ్తుంటాం. దేవాలయాలకు వెళితే.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా.. కోరుకున్న కోరికలు తీరడానికి, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని వేడుకోవడానికి ఆలయాలకు వెళ్తుంటారు. కానీ ఓ దేవాలయంలోకి వెళ్తే మాత్రం ప్రాణాలు పోతాయట. చాలా విచిత్రంగా ఉంది కదూ ఆలయానికి వెళితే ప్రాణాలు పోతాయని తెలిస్తే ఎవరైనా వెళ్తారా చెప్పండి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఆలయంలో అలాగే జరుగుతుందట.
ఆ ఆలయం భారతదేశానికి మధ్యలో ఉన్న మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్ యొక్క త్రికూట కొండ మీద ఉంది. త్రికూట పర్వతం మీద కొండల మధ్య మైహర్ వాలి మాతా ఆలయం ఉన్నది. ఈ ఆలయం దేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రశస్తి చెందినది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 1063 మెట్లు ఎక్కి ఎక్కవలసి ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు.
ఈ దేవాలయంలో శారద అమ్మవారు కొలువై ఉన్నారు. మైహర్ అంటే మా కా హార్ అని అర్థం. అంటే దేవత యోక్క హారం అని తెలుగులో అర్థం. అమ్మవారి ఆలయం త్రికూట్ అనే కొండల మధ్య ఉంది. అయితే ఈ దేవాలయం గురించి అనేక కథలు ఉన్నాయి. ఇక్కడ రాత్రిపూట ఉండాలంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే అని చెబుతుంటారు. రాత్రిళ్లు ఉన్నవారి ప్రాణాలు పోతాయని అక్కడివారి నమ్మకం. మరి ఉదయమంతా భక్తులతో సందడి చేసే ఆలయం రతి సమయాల్లో ఎందుకు ప్రాణాలు తీసే మృత్యు కూపంలా తయారైంది అనేది తెలియాలంటే ఆ గుడి రహస్యాలు ఎంటో తెలుసుకోవాల్సిందే.
అసలు అక్కడ ఏం ఉంది? ఆ ప్రాంతానికి అక్కడి ప్రజలు దేవాలయం గురించి కథలు కథలుగా చెబుతారు. ఈ నమ్మకాలన్నీ నిజమని చాలా మంది నమ్ముతారు కూడా. ఇక రాత్రి పూట అక్కడ ఉండలేమని అంటారు. సాహసం చేసి అలా ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బతికి బట్టకట్టలేరని కూడా చెబుతారు. దానికి ఒక కారణముంది. ఈ నమ్మకం వెనక ఒక కథ ఉంది. ఇప్పటికీ శారద మాతకు అతి పెద్ద భక్తులైన ఆలహ, ఉదమ్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగుతాయట. ఈ రెండు ఆత్మలు అప్పట్లో పృథ్వీ రాజ్ చౌహాన్తో వీరోచితంగా పోరాడారని చెబుతారు. అది కాకుండా వీళ్లిద్దరు మొదటిసారి మైహర్ దేవి ఆలయాన్ని గుట్టల్లో కనుగొన్నారు అని చెబుతారు.
రాత్రిపూట దేవాలయాన్ని మూసివేస్తారు. అక్కడి వారు నమ్మేదాని ప్రకారం ఈ ఇద్దరు సోదరులు ఆత్మలుగా వచ్చి రాత్రి సమయాల్లో అమ్మవారిని పూజిస్తారట. అదే కారణంగా చెప్పి గుడి లోపలికి రాత్రిపూట ఎవరినీ అనుమతించరు. ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మరునాడు ప్రాణాలతో ఉండరని అంటారు. అందుకే రాత్రిళ్లు ఆ దేవాలయం దగ్గర కూడా ఎవరు ఉండరు.
త్రికూట్ అనే కొండల మధ్య ఉన్న శారద దేవిని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం ఇక్కడి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తుంటారని చెబుతారు. అక్కడ అంత భయంకరమైన చరిత్ర ఉన్నా సరే లెక్కచేయకుండా వీరు అక్కడి వస్తారట. మైహర్ లోని సా.శ. 502 నాటి శారదా దేవి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ది చెందింది. ఇది రైల్వే స్టేషన్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలో ఉంది. కొండపైకి చేరుకోవడానికి 1,063 మెట్లు ఉన్నాయి. మెట్లతో పాటు, యాత్రికుల సౌలభ్యం కోసం రోప్వే కూడా ఉంది.