కొంతమందికి జాతకంలో నాగసర్ప దోషాలు ఉంటాయి. ఏదో జన్మలో తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ జన్మలో సర్ప దోషాలు వెంటాడుతాయి. దీని వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లోపించడం, శుభకార్యాలు వాయిదా పడడం, సంతానం ఆలస్యం అవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. నాగపంచమి నోము చేయడం వల్ల నాగసర్ప దోషాలు తొలిగి, సమస్యలు సర్దుమణుగుతాయని పండితులు చెబుతున్నారు.
పూర్వం ఒక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది. ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు. పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు . ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది. చెవిలో చీము కారుతుండేది. రాత్రుల్లో సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు.
అందువల్ల ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని ఉపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాదువు త్రికాలజ్ఞానుడని విని అతని దగ్గరికి వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన అయిపోయాక ఆమె తన బాధలను చెప్పి వాటికి కారణం ఏమై ఉంటుందని, ఇవి తొలిగి పోయే మార్గం చెప్పమని వినయపూర్వకంగా వేడుకుంది.
అందుకు ఆ సాదు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోశంవల్ల సంభవించింది. ఎలాంటి పరిహారం చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు పోవాలన్నా నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల ఈ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది.
నీవు గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కాబట్టి నా మాటల పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు పోతాయి. చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానం దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధానాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళనలు ఆరోగ్యాంగా ఉంది.
ఉద్యాపన: శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉండి నాగేంద్రున్ని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల ఫల పుష్పాదులు నారికేళం సమర్పించాలి. నాడు ఉపవాసం వుండాలి. నిరాహారం జాగరణ మరింత మంచిది.