కులాలకు అతీతంగా మన ఇళ్లలోని దేవుడి మందిరాల్లో ఏఏ దేవతా మూర్తులు ఉండాలి? నిత్య పూజలో పూజించాల్సిన దేవత విగ్రహాలు పంచాయతన విగ్రహాలు. అంటే ఏమిటో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో కులాలకు అతీతంగా ఆస్తికులైన వారందరూ తమ పూజా మందిరాలలో ఐదుగురు (పంచదేవతలు) విగ్రహాలను ఉంచి పూజించాలి.
అవి సూర్యుడు, గణేశుడు, (దేవి) పార్వతి, శివుడు, విష్ణువు. వీరిని సమిష్టిగా పంచాయతన అని వ్యవహరిస్తారు. పంచభూతాలకు ప్రతీకగా కూడా భావించవచ్చు. మన హిందూ, సనాతన సాంప్రదాయ రీత్యా ఈ పంచాయతన పూజ ఎంతో శ్రేష్ఠమైనదిగా మహా ఋషులు తెలిపారు. సకల శుభకార్యాలలోనూ, ప్రతినిత్యం ఈ ఐదుగురు దేవతను పూజించటం వల్ల ఆ గృహంలో నివశించేవారందరికీ శ్రేయస్సు చేకూరుతుంది.
ఈ ఐదుగురు దేవతలా విగ్రహాలు, చిన్నవి మీ గుప్పిటలో సరిపోయే కొలత ఉన్నవి వీటిని ఒక పళ్ళెంలో వుంచుకుని పూర్వాభిముఖంగా కూర్చుని పూజ చేయాలి. ప్రతిరోజూ శుభ్రమైన బట్టతో శుభ్రపరచాలి. సమయాభావం ఉన్నవారు కేవలం ఐదు నిమిషాలలో పూజ పూర్తి చేయవచ్చు. అది ఎలాగంటే?
కేవలం పంచ ఉపచార పూజ దేవతల పేర్లు చెప్పి 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం సమర్పయామి అంటే చాలు. అయితే అన్నిటికంటె ముఖ్యంగా భగవంతుని పూజలో, ఉపచార సమర్పణలో అర్చనచేసే వ్యక్తి భక్తిశ్రద్ధలే గీటురాళ్ళు. అందుకే చివరగా శాస్త్రం “తత్ర భక్తి శ్రద్ధా గరీయసీ” అంటుంది. భక్తితో పూజించే వారి ఇంట పూజ సామాగ్రి లోటు పాట్లు ఉన్న పరవాలేదు ఉన్నంతలో భక్తితో సమర్పిస్తే చాలు.