పురాణాల ప్రకారం అష్టాదశ శక్తీపీటల్లో జగన్మాత కొలువై పూజలందుకుంటుంది. అమ్మవారి శరీరభాగాలు పడిన ప్రాంతాలనే శక్తి పీఠాలుగా కొలుచుకుంటున్నాం. అయితే ఒక్కో ప్రదేశంలో అమ్మవారు ఒక్కోపేరుతో కొలువై ఉంది. కొల్హాపూర్ లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు అంబాదేవిగా విరాజిల్లుతుంది. ఈ ఆలయం మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో ఉంది. ఈ ఆలయం క్రిశ 7 వ శతాబ్దంలో చోళులు ద్వారా నిర్మించబడిందని చరిత్ర చెపుతుంది.
కొల్హాపూర్ లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషం ఏమిటంటే ప్రతి రోజు సూర్య కిరణాలు ఈ విగ్రహానికి బంగారు సొగసులు అద్దే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ నవరాత్రి వేడుకలు చూడటానికి భక్తులు దేశం నలుమూలల నుండి అధిక సంఖ్యలో వస్తారు. ఆ సమయంలో ఈ ప్రాంతం అంతా ప్రకాశవంతమైన రంగులతో, మంచి సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది.
సాధారణంగా హిందూ దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు వైపుకో లేదా ఉత్తరం వైపుకో ఉంటాయి. కాని ఇక్కడ అమ్మవారి విగ్రహం మాత్రం పశ్చిమం వైపుకి తిరిగి ఉంటుంది. పశ్చిమ వైపు గోడకు ఉన్న చిన్న కిటికీ ద్వారా సూర్యాస్తమయం సమయంలో సూర్య కిరణాలు విగ్రహం పై పడతాయి.
విశాలమైన ప్రాంగణములో చుట్టూ ఎత్తైన ప్రహరీ మద్యలో ఉన్న ఈ ఆలయం ఒక అద్భుతమైన కళాసృష్టి అని చెప్పుకోవచ్చు. గుడి చుట్టూ శిల్పాలతో మనోహరంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ ఒక పవిత్ర పుణ్య క్షేత్రం. ఈ ఆలయ ప్రాంగణం లో విటోభా ఆలయం పురాతనమైనది. సూర్య గ్రహణం రోజున ఇక్కడ స్నానం చేస్తే పంచ మహా పాతకాలు పోతాయి అని భక్తుల నమ్మకం.