చలికాలం వచ్చిందంటే చాలు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చాలా మంది పాదాలు పగుళ్లకు గురవుతుంటాయి. ఆ సమస్యను తగ్గించుకోడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.
శీతకాలంలో ఎదురయ్యే పగుళ్ల సమస్య వల్ల పాదాలు నొప్పిగా ఉంటుంది. నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాతావరణం కారణంగా ఈ సీజన్లో కాళ్ళు పొడిబారుతాయి. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మడమల దగ్గర చర్మానికి పగుళ్ళు వస్తాయి. పాదాలు అందవికారంగా తయారవుతాయి.
పాదాలను సరిగ్గా శుభ్రపరుచుకోకపోవడం, వాతావరణంలోని కాలుష్యం, మధుమేహం, సొరియాసిస్, థైరాయిడ్, చర్మ సంబంధమైన పలు సమస్యల వల్ల పాదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి. అయితే దానికి మొదట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు.
పాదాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పొడిబారిన పాదాలపై దుమ్ము పేరుకుండా ఉంచుకోవాలి. అలాగే పగుళ్ళలోకి దుమ్ము వెళితే ఇన్ఫెక్షన్లు రావచ్చు. కాబట్టి పాదాలను తరచూ శుభ్రంగా నీటితో కడుగుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలి. సాక్సులు వేసుకుంటే మరింత రక్షణ ఉంటుంది.
నూనె ఒక చక్కటి మాయిశ్చరైజర్. పాదాలకు నూనె రాసుకొని, కాసేపు ఉంచాక కడుక్కుంటే, చర్మం పొడిబారకుండా నిరోధించవచ్చు. అలాగే నూనెతో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
గ్లిజరిన్లో రోజ్వాటర్ కలిపి పాదాలకు రాస్తే పగుళ్ళు తగ్గుతాయి. పగుళ్ళు తగ్గిన తరువాత మళ్ళీ ఆ సమస్య తలెత్తకుండా ఉండాలంటే గ్లిజరిన్-రోజ్వాటర్ మిశ్రమాన్ని రాస్తూ ఉండాలి. రాత్రి పూట రాస్తే మంచి ఫలితాలుంటాయి.
తులసి ఆకులు, వేపాకులు… ఫంగస్, బ్యాక్టీరియా నివారిణులుగా పనిచేస్తాయి. వాటిని నూరి ముద్ద చేసి, కాస్త పసుపును కలిపి పాదాలకు రాసుకుంటే… పాదాలూ, మడమలూ మృదువుగా మారుతాయి. అంతేకాదు, పాదాలకు పగుళ్ళు పడి, వాటి నుంచి రక్తం వస్తున్నప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తే త్వరగా గాయం నయం అవుతుంది.