శ్లో|| ఆంజనేయం మహావీరం – బ్రహ్మ విష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాతం – రామదూతం నమామ్యహం
”శ్రీరామ” అనగానే వెంటనే మనకళ్ళముందు కదిలే పాత్ర ”హనుమంతుడు”. ఏడుకాండల గ్రంధమయిన ”రామాయణం”లో.. .ఎప్పుడో నాల్గవకాండ అయిన ”కిష్కింధాకాండ”లో ప్రవేశించిన ”హనుమంతుని పాత్ర” నేటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. హనుమంతుని జ్ఞానం గురించి, ధైర్యం గురించి, భక్తి గురించి అందరికి తెలిసిన విషయమే. కానీ హనుమంతుడు సంగీత సరస్వతి ముద్దుబిడ్డ అని కొద్ది మందికే తెలుసు.
ఒకానొక సందర్భంలో హనుమ శ్రీ రాముని పాదాల చెంత చేరి నారద, తుమ్బురులను తమ గానాన్ని వినిపించమని కోరాడు, ఇద్దరు వీణలు సారించారు. గమక యుక్తంగా అలంకారాలు, గీతాలు మధురంగా పలికించారు. స్వర సందర్భం, శ్రుతులు, ఆలాపన , గమకాలూ గీత సరణి, ముక్తాయింపు భలేగా, అమోఘంగా వున్నాయని మెచ్చుకున్నాడు. ఇంతటి ఉద్దండ పండితుల గానాన్ని తాను తేల్చి చెప్పటం సాధ్యం కాదేమో అన్నాడు. తాను నేర్చిన కొన్ని గీతాలను సీతా రాములకు విని పిస్తానని, వారిద్దరిని కూడా వినమని కోరాడు.
వారిద్దరి గానాన్ని మెచ్చిన హనుమ తన గానం వినమనటం లో అర్ధ మేమిటో వారికి అర్ధం కాలేదు. ”కోతులు సంగీత సభ చేస్తే కొండ ముచ్చు అగ్రాసనం మీద కూర్చున్నట్లున్తుంది హనుమ గానం అనుకున్నారు. అంత గొప్ప సంగీతాన్ని తాము వినిపిస్తే , ఇంకా హనుమకు ఏం మిగిలింది వినిపించాటానికి అని విసుక్కున్నారు. తమ గానం ముందు ఇంకెవరి గానమైనా బలాదూరే అని వారి గర్వం. కానీ ఏమీ చేయ లేక తమ వీణలను హనుమకు అందించారు.
నారదుని వీణను తీసుకొని హనుమ పలికించటం ప్రారంభించాడు. ఓంకారం త్రిగునాత్మకము , త్రిమూర్త్యాత్మకము దీనినే ప్రణవం అంటారు. ఇందులో అ , ఉ, మ ఉన్నాయని మనకు తెలుసు. ఆకారం రజో గుణాత్మకం -బ్రహ్మ. ఉ కారం సత్వ గుణాత్మకం -విష్ణువు. మకారం తమో గుణాత్మకం -రుద్రుడు. ఈ విధంగా త్రయాగ్న మైంది . ఓంకారం లో దశ విధ నాదాలు జన్మించాయి. నాభి , ఉదర, కంత వాటి ఉత్పత్తి స్థానాలు. ఆ నాదాలే వాయు చలనం వల్ల హృదయ, కంత, శిరః స్తానాల నుండి అభి వ్యక్తమై, మందార , మధ్యమ , తారకం అనే మూడు స్వర భేదాలను పొందాయి .
ఆ స్వరాల నుండి” స,రి ,గ ,మ ,ప ,ద ,ని ”అనే సప్త స్వరాలు క్రమంగా శివుని యొక్క ”పరమశివ ,ఈశ్వర, సద్యోజాత , వామ దేవ, అఘోర, తత్పురుష , ఈశాన ” అనే ఏడు ముఖాల నుండి పుట్టి ”షడ్జ , రిషభ , గాంధార, మధ్యమ, పంచమ , దైవత , నిషాద ”అన బడే పేర్లతో వ్యాప్తి చెందాయి. వాటి జన్మ స్థానాలు క్రమంగా కంత , శిర, నాస, హృదయ , ముఖ , నాలుక , పూర్వాంగాలు.
మయూర , రిషభ , అజ , సింహ , కోకిల , అశ్వ , మద గజ ధ్వనులే షడ్జం మొదలైన స్వర ధ్వని భేదాలు. షడ్జ స్వరం నుంచి నాలుగు శ్రుతులు , రిషభం నుంచి మూడు , గాంధారం నుండి రెండు , మధ్యమ నుంచి నాలుగు, పంచమం నుండి నాలుగు దైవతం నుంచి మూడు, నిషాదం నుంచి రెండు -సప్త స్వరాలనుండి ఇరవై రెండు శృతి భేదాలు ఏర్పడ్డాయి . ఈ శ్రుతులకు ఇరవై రెండు శృతి గమకాలు, ఏడు దేశీ గమకాలు వున్నాయి. ఈ స్వర శృతి గమకాలలో ఆరు లక్షణాలు గల గీతాలు, ఆ రాగాలకు గ్రామ త్రయం , దాని వల్ల పదిహేను రాగాలు – వాటికి ఆరు జాతులు ,వాటికి ముప్ఫై ఆరు రాగాలు , వాటికి నాలుగు అంగాలు, వాటికినూట ఆరు రాగాలు పుట్టి అనంత కోటి రాగాలుగా విస్తరించింది. ఇన్నిటిలో ముప్ఫై రెండు రాగాలు మాత్రమే లోకంలో ప్రసిద్ధ మైనవి.
వాద్యాలలో తథా , ఆనద్ధ , సుషిర , ఘన అనే నాలుగు వున్నాయి. కాహల , పటహ , శంఖ , భేరి జయ , ఘంటికలు అనేవి అయిదు మహా వాద్యాలు . వీణా మొదలైనవి ఇరవై రెండు రకాలు. తకారం రుద్రుడు
లకారం పార్వతి . ఆ రెండిటి సంపుటినే తాళం అంటారు. తాళానికి కాల , మార్గ , క్రియ , అంగ , జాతి , గ్రహ కళ , లయ , యతి , ప్రస్తారం అనేవి పది ప్రాణాలు. హనుమ భరత శాస్త్రం లో కూడా నిష్ణాతుడు. ప్రవర్తకుడు , దర్శన కారుడు కూడా.
భ అంటే భావం. ర అంటే రాగం. త అంటే తాళం . భావ, రాగ, తాళాలు అంటే సాహిత్య , సంగీతా, నాట్య ముల ఉపయోగం ఇందులో వుంది కనుక ”భరతం ” అని పేరు వచ్చింది. రసాలు , భావాలు , అభినయాలు , ధర్ములు, వృత్తులు , ప్రవృత్తులు , సిద్ధులు , స్వరాలు , ఆతోద్యమములు , గానాలు , రంగాలు అనే పద కొండు విషయాల స్వరూపమే ”నాట్య వేదం ”. అలాంటినాట్య వేదానికి ప్రవర్తకుడు హనుమయే. గాన్ధర్వాన్ని సూర్యుని నుంచి హనుమ నేర్చుకున్నాడు. శ్రీ రాముని కొలువులో తన గాంధర్వ విద్యను మనో ధర్మంగా అమోఘంగా ప్రదర్శించాడు హనుమ . ఆ గానానికి హృదయాలు పద్మాల్లా వికశించాయి. చంద్ర కాంత శిలలు కరిగాయి. లోకం సంమోహనమైంది. అతని వల్లకీ (వీణ) వాద్యానికి రాళ్ళే కరిగి పోయాయి. సభ్యులు పరవశించి పోయారు. బొమ్మల్లా అచేతనులైనారు. వీణ పై హనుమ” మేఘ రంజని ”రాగాన్ని సమ్మోహనంగా వినిపించాడు. అతను ప్రదర్శించిన మెళకువలు, ప్రౌధిమ, రాగాలాపన, గ్రామ స్ఫూర్తి , తార లో అంతర స్ఫురిత నాద ప్రౌధి , మీటు , కంపితం , ఆన్దోలితం , మూర్చన , శ్రుతులు , డాలు , అనేక మైన తాళమానాలు విని జనం మైమరచి పోయారు.
ఆకాశం మేఘాలతో నిండి పోయింది. కొంగలు బారులు తీరాయి. చాతక పక్షులు నోళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తున్నాయి నీటి చుక్క కోసం నెమళ్లు పురి విప్పి నాట్యం చేస్తున్నాయి. పాతాళం లోని పాములు పడగ లెత్తి నర్తించాయి. వర్షం పుష్ప వర్షంగా పడింది. సభ్యుల దివ్య ఆభరణాలన్నీ కరిగిపోయాయి. శశి కాంత వేదికలు కరిగి శ్రవించాయి. విమానం నడిపే వారు గతి తప్పారు. దంతపు బొమ్మలకు ప్రాణాలు వచ్చాయి. హనుమ గానం చేస్తున్నంత సేపు శ్రీ రాముడు మెచ్చి కోలు గా ”ఓహ్ ,ఔరా ,భళా ”అని అభినందిస్తూనే వున్నాడు.
హనుమ వీణా నాదానికి దగ్గర లో వున్న పెద్ద రాయి కరిగి పోయింది. సభలోని వారంతా ఆశ్చర్యం లో ముక్కున వేలు వేసుకున్నారు . నారద ,తుంబురుల తాళపు చిప్పలు తీసుకొని హనుమ ”గుండా క్రియ ”రాగాన్నివీణాపై పలికించాడు. మళ్ళీ ఆ రాయి కఠిన శిలగా మారి పోయింది. తన చేతి లోని వీణను నారదునికి ఇచ్చి ఆ రాయిని మళ్ళీ కరిగించగల వాడే విద్యా దికుడని, ఈ తాళాలను తీసుకోవాటానికి అర్హుడు అని చెప్పాడు. ఇద్దరు విశ్వ ప్రయత్నం చేశారు. రాయి కరగలేదు.
వీణలను నెలపై పెట్టి తలలు వంచుకొని అహంకారం పోగొట్టుకొని సిగ్గుతో నిలబడ్డారు .” మీలో ఎవరో ఒకరు రాయిని కరిగించక పొతే ఎవరు అధికులో నిర్ణయించలేము కదా. తాళాలు కూడా నా దగ్గరే విడిచి పెట్టాల్సి వస్తుంది . అది వాగ్గేయ కారు లైన మీకు ఆవ వమానం కదా ”అన్నాడు హనుమ. పాపం వారిద్దరూ మరింత సిగ్గు పడి ”గాయక సార్వ భౌమా ! హనుమా !మా గర్వం అణగి పోయింది. మేము మా చేష్టలకు సిగ్గు పడుతున్నాము. మీ ముందు మా గానం ఎంత. పద్నాలుగు లోకాల్లో మీ వంటి గాయకుడు లేడు. కఠిన శిలను కరిగించే నేర్పు ఎక్కడా మేము చూడ లేదు! మా తాళాలు మాకు ఇప్పించి మమ్మల్ని కనికరించండి”. అని పశ్చాత్తాపం తో కుంగి విన్నవిన్చుకు న్నారు నారద, తుమ్బురులు ఇద్దరు.
దయామయుడైన హనుమ వారిద్దరిని శ్రీ రాముని అనుగ్రహంతో క్షమించి , వారివీణలు , తాళాలు తిరిగి ఇచ్చి వేశాడు. హనుమ కీర్తి గానం చేసుకుంటూ, వాళ్ళిద్దరూ సెలవు తీసుకొని వెళ్లి పోయారు.