చాలామంది అందంగా ఉండడానికి ముఖం తెల్లగా ఉంటే చాలు లోపలున్న పళ్లను ఎవరుచూస్తారని అనుకుంటారు. కానీ తనవితీరా నవ్వాలంటే హాస్యం ఒక్కటే సరిపోదు చూడచక్కటి దంతసిరి కూడా ఉండాలి. చక్కటి పళ్లవరస చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మరి అలాంటి పళ్లు మీ సొంతం కావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పళ్లని రోజుకి రెండు సార్లు శుభ్రం చేసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతోపాటు భోజనం చేసిన తర్వాత నీటితో పుక్కిలించి పళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కుపోయి ఆహారం వెళ్ళిపోతుంది. అలాగే తీపి వస్తువులు తిన్న తర్వాత కూడా నోటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే తిన్న కాసేపటికే నోరంతా దుర్వాసన వస్తుంది. పళ్లు త్వరగా పాడవడానికి ఇదొక కారణం.
కొంతమంది బ్రష్ని గట్టిగా పట్టుకుని పళ్లపై గట్టిగా రుద్దుతారు. దీని వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. పళ్లపై నున్న ఎనామిల్ పొర కూడా త్వరగా పోతుంది. తద్వారా పళ్ల రంగు మారిపోతుంది. అందుకే బ్రష్తో పళ్లపై ఒకటికి రెండుసార్లు సున్నితంగా తోమండి.
ఇవే కాదు పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ కుడా పళ్లరంగు మారడానికి కారణమవుతాయి. ఫాస్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు అందులో వుండే హానికారకాలు పళ్లపై నేరుగా ప్రభావం చూపడంతో.. క్రమంగా తెల్లగా వుండే పళ్లు పసుపుపచ్చ రంగులోకి మారుతాయి.
చాలా మంది తమ పళ్లను తెల్లగా మార్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి నిరాశపడుతున్నారు. అటువంటి వారికి నిపుణులు ఓ సింపుల్ చిట్కా అందిస్తున్నారు. ఏవేవో రసాయనాలు వాడి మరిన్ని సమస్యల్ని కొనితెచ్చుకోవడం కంటే.. నిమ్మకాయతో తళతళలాడే పళ్ళను తెచ్చుకోవచ్చని చెబుతున్నారు.
ఒక గిన్నెలో తాజా నిమ్మకాయను పిండి రసాన్ని తీయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కలబెట్టాలి. బ్రషింగ్ చేయడం పూర్తి అయ్యాక ఆ రసాన్ని రెండు సార్లు నోట్లో పోసుకొని.. రెండు నిమిషాలపాటు పుక్కిలించి ఊమ్మేయాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే చాలు.. పళ్లపై ఉన్న గార లేదా పాచితో ఉప్పు, నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్లు రసాయన చర్యలు జరుపుతాయి. వాటిపై గార లేదా పసుపు పచ్చటి పొర తొలగిస్తాయట. ఇలా చేస్తే వారానికి పళ్లు తళతళా మెరవడం ఖాయం.