Home Health చిన్నపిల్లలకి ఏ వయసు నుండి నాన్‌వెజ్ తినిపించొచ్చు?

చిన్నపిల్లలకి ఏ వయసు నుండి నాన్‌వెజ్ తినిపించొచ్చు?

0

మొదటిసారి పిల్లలకి భోజనం తినిపించడం మొదలు పెట్టినప్పట్నుంచి ప్రతి తల్లి మనసులో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఏ విధమైన ఆహారం పిల్లలకి పెట్టాలి. ఏ ఆహారం పిల్లలకి మంచిది. అసలు వారికి సరిపడే ఫుడ్ ఏంటి ఇలాంటి ఎన్నో డౌట్స్ ప్రతి మహిళ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా.. పిల్లలకి నాన్‌వెజ్ పెట్టొచ్చా.. పెడితే ఏ వయసులో పెట్టాలి. ఎప్పుడు పెడితే వారు ఆ ఆహారాన్ని అరిగించుకోగలరు. ఇలాంటి సందేహాలన్నీ ప్రతి తల్లిని వెంటాడే ప్రశ్నలే. అలాంటి ప్రశ్నలకు నిపుణులు ఏం సమాధానాలు చెబుతున్నారో చూద్దాం.

non-veg be fed to young childrenఎదిగే పిల్లలకు మంచి పోషకాహారం పెట్టాలి. అయితే, వారు ఎక్కువ మొత్తంలో ఆహారంలో తీసుకోలేరు. కొద్ది పరిమాణంలోనే వారికి ఆహారం పెడుతూ పోషకాలన్నీ సరిగ్గా అందేలా చూసుకోవాలి. ఇందుకోసం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పిల్లలకు అన్నం పెట్టొచ్చు. కానీ, ఆ అన్నం గట్టిగా ఉండకూడదు. మెత్తగా ఉండాలి. అప్పుడే పిల్లలకి జీర్ణ సమస్యలు రావు. అందుకే వారికి పెట్టే అన్నం మెత్తగా ఉడికించాలి. అందులో పప్పు, నెయ్యి, ఉడికించిన కూరగాయలు తప్పనిసరి ఉండాలి. అప్పుడే వారికి సంపూర్ణ పోషకాహారం అందించిన వారవుతాం.

అయితే, మొదటి కొన్ని రోజులు కూరగాయలు, పండ్లు కూడా లోపలి భాగాన్నే పెట్టాలి. ఎందుకంటే మొదట్లో వారి అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ముందుగానే వారికి అటువంటివి పెట్టకూడదు. ఇక పిల్లలకు 6 నెలల నుంచి ఉడికిన గుడ్డు పెట్టొచ్చు. అయితే, అది కూడా తెల్లసొన మాత్రమే పెట్టాలి. పచ్చ సొన త్వరగా పిల్లలకు అరగదు. కాబట్టి కొన్ని రోజుల వరకూ అది పెట్టకపోవడమే మంచిది. మాంసాహారం విషయానికి వస్తే…మిగతా ఆహారంతో పోల్చితే మాంసాహారంలో కేలరీలు, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆహారం అంత త్వరగా పెట్టడం మంచిది కాదు. ఏడాదిన్నర నుంచి పిల్లలకి మాంసాహారం పెట్టొచ్చు. అయితే పిల్లలకి ఆహారం పెట్టే విషయంలో ప్రతి తల్లి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే…

ఆహారం పెట్టే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు హడావిడిగా పెట్టకూడదు. ఎత్తుకుని అటూ ఇటూ తిప్పుతూ పెట్టాలి. అదే విధంగా.. వారికి కాచి చల్లార్చిన శుభ్రమైన నీటిని మాత్రమే తాగించాలి. వారికి పొలమారితే కొద్దిగా నీటిని తాగించొచ్చు. ఆ నీరు కూడా కాచి చల్లార్చినదే అయి ఉండాలి. దీంతో పాటు పిల్లలకు వాడే గిన్నెలు, చెంచాలు రోజూ వేడినీటిలో మరిగించాలి.

ఇంకా ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టకూడదు. కొద్దిగా కొద్దిగా పెడుతుండాలి. ఇలా పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా కచ్చితంగా శుభ్రంగా ఉండాలని సూచిస్తున్నారు. చాలా మంది తల్లులు పిల్లలకి ఉగ్గు ఒకేసారి కలిపి పెట్టి సాయంత్రం కూడా అదే తినిపిస్తారు. ఇది ఎంతవరకు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. దీంతో వారికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు వారికి ఆహారం చేసి పెట్టడం మంచిది. అప్పుడే వారు కూడా తృప్తిగా తింటారు.

 

Exit mobile version