తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి. ఈయన మానవతవాది, సంఘ సంస్కర్త, ఉపాద్యాయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. 19వ శతాబ్ది రెండోభాగంలో తెలుగు ప్రజల కోసం ఉద్యమకర్తలై సమాజానికి ఎంతో సేవ చేసిన ముగ్గురు ప్రముఖుల్లో గిడుగు వెంకట రామమూర్తి గారు ఒకరు. ఈయన తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. అందుకే వీరి జన్మదినమైన ఆగస్టు 29 ను తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. మరి అయన జీవితం ఎలా సాగింది? అయన సమాజానికి చేసిన సేవల ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. రామమూర్తికి అక్షరాభ్యాసం అయ్యాక గున్నయ్య అనే పంతులు ఇంటికి వచ్చి సంస్కృతం, తెలుగు, గణితం నేర్పేవాడు. సూక్ష్మగ్రాహి, అసాధారణ ఉన్న రామమూర్తి శబ్ధమంజరిని ఎనిమిది సంత్సరాలకే నేర్చకున్నాడు. రామమూర్తి త్రండి చిన్నతనంలోనే మరణించాడు.
రామమూర్తి, గురజాడ అప్పారావు స హోపాధ్యాయులు. వారి ఇరువురి స్నేహం జీవితాంతం కొనసాగింది. గిడుగు రామమూర్తి పర్లాకిమిడిలో పనిచేస్తున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్న గిరిజనులతో పరిచయం ఏర్పడింది. గిరిజనుల కోసం ఒక భాషను రూపొందించాలన్న ఉద్దేశ్యం ఆయనకు ఏర్పడింది. తెలుగు సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు. ఈపరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళుపెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళభాషలోనే చదువుచెప్పే ఏర్పాట్లు చేశారు. మద్రాసుప్రభుత్వం వారు ఈకృషికి మెచ్చి 1913లో రావ్ బహదూర్ బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణనిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు. సవర దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబభాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి.
1911లో గిడుగువారు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయారు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు ఆయన దృష్టి మళ్ళింది. పూర్వం తెలుగులో పాఠ్యాంశాలు అన్నీ గ్రాంధిక బాషలోనే ఉండేవి. 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు పాఠశాలాల ఇన్స్పెక్టర్గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే బ్రిటీష్ అదికారి ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఉన్న తేడాలు చూసి ఆవేధన చెందారు. ఆయన అదే విషయాన్ని గిడుగు వారితో చర్చించారు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది.
అప్పటి నుంచి ఛాందస పండితులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. గురజాడ మిత్రుడికి అండగా నిలిచాడు. ఆంధ్రదేశం నుంచి వెలువడుతున్న పత్రికలు కొన్ని గ్రాంథిక భాషను సమర్ధిస్తే తెలుగు వెలుగులు కొన్ని వ్యవహారిక భాషను సమర్ధించాయి. మొదట గ్రాంథిక వాదాన్ని బలపరిచిన కందుకూరి వీరేశలింగం పంతులు గిడుగు వాదనలో నిజాన్ని గ్రహించాడు. పత్రికలు ప్రజలకు ఉపయోగపడాలంటే వ్యవహారిక భాషలో ఉండాలని తను నిర్వహించే పత్రికల్ని వ్యవహారిక భాషలో వెలువరించడం ప్రారంభించాడు. అసమాన ప్రతిభావంతుడైన గురజాడ అప్పారావు వ్యవహారిక భాషలో రచనలు చేసి గిడుగుకు అండగా నిలిచాడు. రామమూర్తి సంపాదకత్వంలో వెలువడిన తెలుగుపత్రిక పూర్తిగా వ్యవహారిక భాషలో నడిచింది. ఒక్క సంవ త్సరమే అయినా రామమూర్తి పంతులు భాషా వాదానికి ఈ పత్రిక అద్దం పట్టింది.
రామమూర్తి వ్యవహారిక భాషా ఉద్యమంలో నిజాన్ని గ్ర హించిన ఆంధ్రపత్రిక దినపత్రికలో కూడా వార్తలు క్రమంగా వ్యవహారిక భాషలో రావడం మొదలైంది. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల వారు కూడా వ్యవహారిక భాషను ఆమోదించారు. పాఠ్య గ్రంథాలు వ్యవహారిక భాషలో రావడం మొదలైంది. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ వీలైంది. తెలుగు నాట వాడుక భాషా వ్యాప్తికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారిక భాషా వ్యాప్తికి చాలా సంతృప్తి పొందాను కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాను అని తెలియచేసాడు.
తెలుగుబాషకు ఎనలేని సేవ చేసి తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా చరిత్రలో నిలిచిన గిడుగు వెంకట రామమూర్తి గారు 1940, జనవరి 22న కన్ను మూశారు.