Home Unknown facts కంసుడి బారినుండి పార్వతి దేవి కృష్ణుణ్ణి ఎలా కాపాడిందో తెలుసా ?

కంసుడి బారినుండి పార్వతి దేవి కృష్ణుణ్ణి ఎలా కాపాడిందో తెలుసా ?

0

కంసుడి బారినుండి పార్వతి దేవి కృష్ణుణ్ణి ఎలా కాపాడిందో తెలుసుకుందాం. కృత, త్రేతా యుగాలు తర్వాత ద్వాపర యుగంలో రాక్షసులు విపరీతంగా మనుషులై పుట్టి, భూమికి బరువయ్యారు. భూదేవి విష్ణువుతో మొరపెట్టుకుంది. విష్ణువు, ‘‘దేవీ! కృష్ణావతారం ఎత్తి, నీ ఆర్తి తొలగిస్తాను!’’ అని అభయమిచ్చాడు.ఆదికాలం నుంచీ విష్ణువుకు శత్రువైన కాలనేమి రాక్షసుడు కంసుడుగా పుట్టి, మధురానగరాన్ని పాలించే ఉగ్రసేనుడి కుమారుడనిపించుకున్నాడు.

Kamsaదేవాసుర యుద్ధంలో, దానవ నాయకుడై విష్ణువుతో భీకరంగా పోరాడిన విప్రచిత్తి, మగథ రాజ్యాన్నేలే జరాసంధుడై పుట్టి, రాజులను తెచ్చి భైరవుడికి బలులిచ్చి అతి శ్రద్ధగా దీక్షతో అర్చిస్తున్నాడు. కంసుడు జరాసంధుడి అల్లుడు.ఉగ్రసేనుడి తమ్ముడి కుమార్తె దేవకికి, యదువంశ రాజైన వసుదేవుడితో వివాహం జరిగింది. కంసుడు వారిని రథం మీద తీసుకుపోతూండగా, ఆకాశవాణి – దేవకి ఎనిమిదో సంతానంవల్ల కంసుడు చంపబడతాడు – అని పలికింది. కంసుడు దేవకిని చంపకుండా వసుదేవుడు అడ్డుపడి, ఆమె ప్రసవించే బిడ్డల్ని అప్పగిస్తానని కంసుడికి ఇచ్చిన మాట తప్పకుండా, ఆరుగుర్ని అప్పగించాడు.

దేవకి ఏడవ గర్భాన విష్ణువు అంశతో ఆదిశేషుడు పడ్డాడు. ఆ పిండాన్ని గోకులంలో ఉన్న వసుదేవుడి మరొక భార్య అయిన రోహిణి గర్భాన చేర్చి, తరువాత నందగోపుడి భార్య యశోదకు కూతురుగా పుట్టమని యోగ మాయాదేవిని విష్ణువు ఆదేశించాడు. దేవకి ఏడవగర్భం ప్రసవం రాకుండా అణగారిపోయింది. తర్వాత దేవకి ఎనిమిదోసారి గర్భం ధరించిన వెంటనే, దేవకీ వసుదేవుల్ని కంసుడు కారాగారంలో పెట్టాడు.

అది శ్రావణ మాసం. కృష్ణపక్షం. అష్టమి ప్రవేశించింది. చంద్రుడు రోహిణీ నక్షత్రంతో ఉన్నాడు. నడి రాత్రి. యోగ మాయ కారణంగా కావలి భటులకు చావునిద్ర ముంచుకొచ్చింది. దేవకి ప్రసవించింది. విష్ణువు కృష్ణుడుగా అవతరించాడు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. విష్ణువు ఆదేశంతో వసుదేవుడు బిడ్డని యమునానదిని దాటించి, అదే సమయంలో గోకులంలో అందర్నీ మాయనిద్ర ఆవహించగా, ఆ నిద్రలోనే ఆడపిల్లను ప్రసవించిన యశోద పక్కలో పిల్లవాణ్ణి ఉంచి, ప్రాణం లేనట్లున్న పిల్లను తీసుకొని తిరిగి వెళ్ళాడు.

చెరసాల చేరగానే దిక్కులు పిక్కటిల్లేలాగ ఆ శిశువు క్యారుమని శబ్దం చేసింది. కంసుడు శిశువును కొట్టి చంపబోగా పైకెగిరి, పకపక నవ్వుతూ, ‘‘ఓరి, కంసా! నిన్ను చంపేవాడు క్షేమంగా ఉన్నాడులే!’’ అని చెపుతూ, దుర్గాదేవిగా కనిపించి అంతర్థానమైంది. కంసుడు భయంతో, ఆగ్రహంతో దేవకీ వసుదేవుల ఎదుట వారి ఆరుగురి బిడ్డల్నీ కడతేర్చాడు.

గోకులంలో కృష్ణుడు పుట్టినందుకు కృష్ణాష్టమి, గోకులాష్టమిగా వేడుకలు జరిగాయి. అంతకుముందే కృష్ణుడికి అన్నగా రోహిణికి బలరాముడు పుట్టాడు.

 

Exit mobile version